ములుగు, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని అటవీ ప్రాంతంతో పాటు మైదాన ప్రాంతాల్లో వేటగాళ్లు వన్య ప్రాణులను వేటాడినా, వారికి ప్రజలు సహకరించినా వన్య ప్రాణి చట్టం ప్రకారం అటవీ శాఖ ద్వారా కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ములుగు ఇన్చార్జి డీఎఫ్వో శివ్అశీష్సింగ్ హెచ్చరించారు. శుక్రవారం సాయం త్రం ఫారెస్టు కార్యాలయంలో ఆయన విలేకరు ల సమావేశం నిర్వహించారు. గొత్తికోయ గూడేల్లో దాడులు చేసి స్వాధీనం చేసుకున్న విల్లులు, బాణాలు, గొడ్డళ్లు, రంపాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొత్తికోయలు అడవిలో అమర్చిన ఉచ్చు కారణంగా పెద్దపులి ఇటీవల చనిపోయిన సంఘటన అనంతరం జిల్లా వ్యాప్తంగా అడవుల్లో నివాసం ఉంటున్న గొత్తికోయ గుంపులు, గూడేల్లో పోలీస్ , అటవీ శాఖ అధికారులతో దాడులు నిర్వహించి వేట సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఎవరైనా పులి జాడలు గమనిస్తే వెంటనే ఫారెస్టు అధికారులతో పాటు ఇతర శాఖల అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
వన్య ప్రాణుల కోసం పొలాల చుట్టూ ఉచ్చులు ఏర్పాటు చేసి విద్యుత్ కనెక్షన్ ఇచ్చినట్లు కనిపిస్తే బీట్ అధికారులకు ప్రజలు సమాచారం అందించాలన్నారు. అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో కనిపించిన వ్యక్తుల సమాచారాన్ని సైతం అటవీ శాఖ అధికారులకు అందించి వన్య ప్రాణుల రక్షణకు ప్రజలు దోహదపడాలని కోరారు. వేటగాళ్లు అమర్చిన ఉచ్చులను గుర్తించేందుకు తెలంగాణ అటవీ శాఖ ద్వారా ప్రత్యేకంగా శిక్షణ పొందిన జాగిలాన్ని (కుక్క)ను ములుగు జిల్లాలో రంగంలోకి దింపినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఈ జాగిలం ద్వారానే అటవీ ప్రాంతంలో అనేక చోట్ల ఉచ్చులను తొలగించినట్లు తెలిపారు. సమావేశంలో ఎఫ్ఆర్వోలు రామ్మోహన్రావు, గౌతమ్రెడ్డి, గోపాల్రావు, శిరీష, ఇతర అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఖమ్మం జైలుకు వేటగాళ్లు
పెద్దపులిని చంపిన కేసులో అటవీ శాఖ అధికారులు అరెస్టు చేసిన ఐదుగురు గొత్తికోయ నిందితులకు ములుగు సివిల్ కోర్టు జడ్జి 14రోజుల రిమాండ్ విధించినట్లు ఇన్చార్జి డీఎఫ్వో శివ్అశీష్సింగ్ తెలిపారు. తాడ్వాయి ఎఫ్ఆర్వో లింగాల సతీశ్ ఆధ్వర్యంలో శుక్రవారం నిందితులను ఖమ్మం సబ్ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా డీఎఫ్వో మాట్లాడుతూ మడకం రాము, ముచ్చకి అంద, మడకం సతీశ్, కోవాసి ఇడుమ, ముచ్చకి రాజ్కుమార్ను సబ్జైలుకు తరలించినట్లు తెలిపారు. పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉంటూ అడవులకు వెళ్లే ముందు బీట్ ఆఫీసర్ల అనుమతి తీసుకోవాలన్నారు. ఫారెస్టు అధికారుల అనుమతి లేకుండా అడవుల్లోకి వెళ్లే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన హెచ్చరించారు.