వరంగల్, ఏప్రిల్ 11 : గుంటూరుకు చెందిన నజీరుద్దీన్ను పెళ్లి చేసుకున్న గుంటూరు వాస్తవ్యురాలైన కావ్య-నజీరుద్దీన్కు వరంగల్ ప్రజలు ఎందుకు ఓటెయ్యాలని వరంగల్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి అరూరి రమేశ్ ప్రశ్నించారు. గురువారం హనుమకొండలో బీజేపీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్తో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా బిడ్డగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి వర్ధన్నపేట ప్రజలకు తోడున్నానన్నారు. గుంటూరు కోడలు కావాలా? వరంగల్ బిడ్డ కావాలో ప్రజలు ఆలోచించాలని కోరారు. కడియం శ్రీహరి కుట్రకు తాను బలయ్యాయని, మూడోసారి గెలిస్తే మంత్రి రేసులో ఉంటాననే అనుమానంతో తన ఓటమికి కుట్ర చేశాడని అరూరి మండిపడ్డారు. ఎస్సీ రిజర్వేషన్ ఫలాలను మాల, మాదిగలకు అందకుండా చేశారని విమర్శించారు. బీఆర్ఎస్లో ఉండి ఎస్సీ నేతలను బయటకు పంపించే వరకు కుతంత్రాలు చేశారన్నారు. చివరికి పార్టీని మోసం చేసిన వ్యక్తి కడియం శ్రీహరి అని మండిపడ్డారు. టీడీపీ, బీఆర్ఎస్లో దళితుడి పేరిట పదవులు పొంది చివరికి దళితులకు అన్యాయం చేశారన్నారు. ఏ పార్టీలో ఉన్నా కడియం శ్రీహరి దళితులను ఎదగకుండా అణచివేశారని ఆరోపించారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ కావాలనే కరువు తెచ్చిందని బీజేపీ మహబూబాబాద్ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్ అన్నారు. కాళేశ్వరం పిల్లర్ కుంగిన అంశాన్ని బూచిగా చూపి కాంగ్రెస్ ప్రభుత్వం పంటలను ఎండబెట్టిందని విమర్శించారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించక పోవడం రైతులపై ఉన్న ప్రేమ అర్థం అవుతోందన్నారు. వరంగల్ పార్లమెంట్ ఇన్చా ర్జి మురళీధర్గౌడ్, క్రమశిక్షణ కమిటీ కన్వీనర్ మార్తినేని ధర్మారావు, మాజీ ఎంపీలు గరికపాటి మోహన్రావు, చాడ సురేశ్రెడ్డి, వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షులు గంటా రవికుమార్, రావు పద్మ పాల్గొన్నారు.