బయ్యారం, జూలై 19 : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్)లో బీఆర్ఎస్ శ్రేణులు ఏమరపాటుగా ఉండొద్దని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు సూచించారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని గౌరారం, బయ్యారం, కొత్తగూడెం, గురిమళ్ల, వినోభానగర్ గ్రామాల్లో సర్పై మాజీ జడ్పీ చైర్పర్సన్ బిందుతో కలసి బీఎల్ఏలతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్లు ఎన్యుమరేషన్ ఫామ్స్ ఎలా నింపాలో తెలియక ఇంకా ఇబ్బంది పడుతున్నారని, వారి సందేహాలు నివృత్తి చేయాలని సూచించారు.
గడువు దగ్గర పడుతున్నదన్న విషయాన్ని గుర్తుంచుకొని ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువు రాని ప్రజ లు సర్ను పట్టించుకోవడం లేదని, ఈఎఫ్లు నింపి ఇవ్వకుంటే ఓటు హక్కు కోల్పోతారని వారికి అవగాహన కల్పించాలన్నారు. కొన్నిచోట్ల బీఎల్వోలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో డిజిటలైజేషన్ ప్రక్రియ ఆలస్యమవుతున్నదన్నారు. ఎన్నికల సమయంలో దొంగ హామీలిచ్చిన కాంగ్రెస్ సర్కారు వాటిని అమలు చేయడంలో విఫలమైందని, అందువల్లే ఆ పార్టీ నాయకులు గ్రామాల్లోకి రావడానికి మొహం చాటేస్తున్నారన్నారు.
రైతులకు కనీసం నీళ్లిచ్చే పరిస్థితి లేదని, కాంగ్రెస్ నిజ స్వరూపం ప్రజలకు తెలిసిపోయిందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసేం త వరకు కాంగ్రెస్ను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. అబద్దపు మాటలు మానుకొని ప్రజల కష్టాలపై పాలకులు దృష్టి సారించాలని తక్కళ్లపల్లి హితవు పలికారు. సమావేశాల్లో బీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు గణేశ్, సర్పంచ్లు సుమలత, భద్రయ్య, లలిత, నాయకులు హరిసింగ్ నాయక్, సిలివేరు సత్యనారాయణ, దేవీలాల్ నాయక్, ఐలయ్య, లక్ష్మణ్, ఆర్ వెంకటేశ్వర్లు, శోభన్, శ్రీకాంత్, కల్పన పాల్గొన్నారు.