కరీమాబాద్, జూన్ 9: సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి అందుతున్నాయని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో శుక్రవారం రంగశాయిపేటలో తెలంగాణ సంక్షేమ సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ మానవతా దృక్పథంతో సీఎం కేసీఆర్ ప్రతి కుటుంబానికీ చేయూతనిస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో లక్షలాది మందికి ఆసరా పింఛన్లు అందిస్తున్నారన్నారు. తెలంగాణ రాక ముందు పరిస్థితులు.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. వాటిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులపై ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు పారదర్శకంగా అందుతున్నాయన్నారు. బీఆర్ఎస్ను బలోపేతం చేయాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు.
అన్ని వర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న మనసున్న గొప్ప నేత సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కొనియాడారు. వరంగల్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా వరంగల్లో 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మిస్తున్నట్లు గుర్తుచేశారు. నూతన కలెక్టరేట్, కొత్త బస్స్టేషన్ నిర్మాణం కానున్నాయన్నారు. మూడోసారి బీఆర్ఎస్దే విజయమని ధీమా వ్యక్తం చేశారు. తూర్పులో పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు.
తూర్పు నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సంక్షేమ పథకాలను అందజేశారు. 95 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. 82 మందికి మైనార్టీ రుణాలు అందించారు. 70 మందికి సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. 24 యూనిట్ల గొర్రెలను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.