యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : ఢిల్లీలో తెలంగాణ గళం వినిపించాలంటే భువనగిరి ఖిలాపై గులాబీ జెండా ఎగురాలని, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ను గెలిపించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ హామీలను అమలు చేయాలంటే ప్రశ్నించే గొంతుకలను గెలిపించాలని కోరారు. భువనగిరి పట్టణంలో బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశం బుధవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. దీనికి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డితోపాటు హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ 2014లో పార్టీని లోక్సభ ఎన్నికల్లో గెలిపించుకున్న స్ఫూర్తితోనే 2024లోనూ గెలిపించాలన్నారు. నలభై రోజులు కష్టపడితే భువనగిరిలో భారీ విజయం మనదేనని చెప్పారు. అసెంబ్లీలో కొట్లాడాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించాలన్నారు. గట్టిగా పనిచేద్దామని, కష్టకాలంలో ఉన్న కార్యకర్తలనే నాయకులుగా చేసుకుందామన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ మోసాలపై గ్రామాల్లో చర్చ పెట్టాలని పిలుపునిచ్చారు. మహిళలు, రైతులకు మోసాలను విడమర్చి చెప్పాలన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు.
మళ్లీ కాంగ్రెస్కు ఓటేస్తే ప్రజలను మోసం చేసినా తమకే ఓటేశారనే ప్రచారం చేసుకుంటారని, తాము అసెంబ్లీలో ప్రశ్నించడానికి వీలుండదని హరీశ్రావు అన్నారు. రేవంత్ రెడ్డి పేగులు మెడలో వేసుకుంటానని అంటున్నారని, ఆయనేమన్న రాక్షసుడా..? మానవీయ పాలన అందించాలి తప్ప.. ఇవేం మాటలని ఎద్దేవా చేశారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు, నిరుపేదలు అందరినీ కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. రైతులకు ఇచ్చిన ఏ హామీని కూడా అమలు చేయని ఆ పార్టీకి ఓట్లు అడిగే హక్కు లేదని చెప్పారు. రేవంత్ రెడ్డి గేట్లు తెరుస్తానంటున్నారని, ఫిరాయింపులకు కాదు.. పంటలు కాపాడడానికి గేట్లు తెరవాలని హితవు పలికారు. రాష్ట్రంలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఇచ్చామని, యాదాద్రి భువనగిరికి కూడా మంజూరు చేశామని, కానీ చేతగాని ప్రభుత్వం వల్ల ఈ సారి తరగతుల ప్రారంభంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు.
ఎన్నికల ముందు ప్రజలకు అసత్యపు, అబద్ధాల మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 11 సార్లు రైతుబంధు వేసి 12వ విడుత రైతు బంధు నగదును బ్యాంకులో పెట్టగా కాంగ్రెస్ కుట్రతో అకడనే ఆగిపోయింది. జలాశయాల్లో నీళ్లున్నా వదలకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పంటలను ఎండబెట్టింది. రైతుబంధు ఇవ్వక అన్నదాతలను గోస పెడుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 24 గంటల కరెంట్, నీళ్లు ఇప్పుడు ఎందుకు ఇస్తలేరు. తెలంగాణ రాక ముందు 30 నుంచి 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తే తెలంగాణ వచ్చిన తర్వాత మూడు కోట్ల మెట్రిక్ టన్నులకు చేరింది. వ్యవసాయ రంగంలో రాష్ర్టాన్ని అగ్రస్థానంలో నిలిపిన ఘనత కేసీఆర్దే. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు రైతులకు రెండు లక్షల రుణమాఫీ, ఎకరాకు రూ.15 వేలు, వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇప్పటికీ ఇవ్వలేక బోగస్ మాటలు చెబుతూ కాలం గడుపుతున్నది. పంట నష్టానికి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.10వేల చొప్పున ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు ఎండిన పంటలకు ఎకరానికి రూ.25 వేల చొప్పున ఇవ్వా లి. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రజలపై తిరుగుబాటు దాడు లు, పోలీస్ కేసులు పెరిగాయి. ఎవరూ అధైర్య పడొద్దు, బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది.
‘భువనగిరిలో పోటీ చేస్తున్న క్యామ మల్లేశ్ బలహీన వర్గాల నేత. బీసీల కోసం ఎంతో చేశారు. ఎన్నో ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నది. వివాదరహితుడు, సౌమ్యుడు. ఆయనను పార్లమెంట్కు పంపాలి.’ అని హరీశ్రావు కోరారు. తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేసే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని, మళ్లీ అధికారంలోకి వచ్చేది గులాబీ పార్టీనే అని చెప్పారు. కాంగ్రెస్ కేసులకు భయపడేది లేదని, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, తెలంగాణ భవన్లో ప్రత్యేకంగా లీగల్ టీమ్ను ఏర్పాటు చేశామని తెలిపారు. తెలంగాణ ఉన్నంత కాలం, భూమి ఉన్నంత కాలం గులాబీ జెండా ఉంటుందన్నారు. సమావేశంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీతామహేందర్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, గాదరి కిశోర్ కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్, బీఆర్ఎస్ నేతలు కర్నె ప్రభాకర్, చింతల వెంకటేశ్వరరెడ్డి, పాల్వాయి స్రవంతి రెడ్డి, సూదగాని హరిశంకర్ గౌడ్, జడల అమరేందర్, కొలుపుల అమరేందర్, ఎనబోయిన ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.