నర్సంపేట రూరల్, ఆగస్టు 8: నర్సంపేట నియోజకవర్గ రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ ప్రాజెక్టు వరంగా మారనుందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ యాంత్రీకరణ ప్రాజెక్టు పైలట్గా నర్సంపేటకు మంజూరు కావడం హర్షణీయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో 50 శాతం సబ్సిడీతో రూ. 75 కోట్లతో ప్రత్యేక ఫామ్మేకనైంజ్ (వ్యవసాయ యాంత్రీకరణ) ప్రాజెక్టు మంజూరైందన్నారు. పది రోజుల్లో ఈ ప్రాజెక్టు ప్రారంభం అవుతుందని, నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన 51 వేల రైతు కుటుంబాలకు ఈ ప్రాజెక్టులో అవకాశం కల్పిస్తామన్నారు.
ప్రాజెక్టు వినియోగంపై రైతులకు పూర్తి అవగాహన కల్పిస్తామన్నారు. నర్సంపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో మరో మూడు నాలుగు రోజుల్లో రైతులకు అవగాహన కోసం వ్యవసాయ యాంత్రీకరణ స్టాళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. 50 శాతం సబ్సిడీ ప్రతి రైతుకు వర్తిస్తుందని, రూ. 37.5 కోట్ల సబ్సిడీని నేరుగా రైతులకు అందుతుందని, మిగతా రూ. 37.5 కోట్లను రైతులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. రైతు నోట ఏ వ్యవసాయ వస్తువు అడిగితే ఆ వస్తువు అందుబాటులో ఉంటుందన్నారు. 18 వేల పీవీసీ పైపుల యూనిట్లు, హెచ్డీపీఈ పైపులు, రోటవేటర్లు, 3 వేల కరెంటు మోటార్లు, 30 వేల టార్ఫాలిన్ కవర్లు, మినీ ట్రాక్టర్లు, అగ్రికల్చర్ ట్రాన్స్ఫోర్టు వెహికిల్స్, కలుపుతీసే యంత్రాలు, 4 వేల తైవాన్ పైపులు, మల్టీక్రషర్స్, ప్యాడీ ప్లాంటేషన్ మిషన్స్, కాటన్ పికింగ్ మిషన్స్, స్పేయర్స్, హార్వేస్టింగ్ మిషన్లు, టిల్లర్స్, మోడ్రన్ హ్యాండ్ టూల్స్, రైతులకు ఉపయోగపడే వివిధ పరికరాలు ఈ ప్రాజెక్టులో సబ్సిడీపై రైతులకు అందిస్తామన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో రైతుల కోసం గతంలో ఉన్న 13 విద్యుత్ సబ్స్టేషన్లను 30కి పెంచుకొని నాణ్యమైన విద్యుత్ను అందిస్తున్నామని స్పష్టం చేశారు.
ప్రతిపక్షాలకు మాట్లాడే హక్కు లేదు..
ప్రతిపక్షాలకు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదని ఎమ్మెల్యే పెద్ది అన్నారు. చౌకబారు, చిల్లర విమర్శలకే వారంతా పరిమితమయ్యారని విమర్శించారు. నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్, బీజేపీ నాయకులు అక్కడక్కడా మీటింగ్లు పెట్టి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, రానున్న రోజుల్లో వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. 2014లో కురిసిన వడగండ్ల వర్షానికి నష్టపోయిన రైతులకు ఆ నాయకులు ఒక్క రూపాయి సాయం అందించకపోవడం సిగ్గుచేటన్నారు. కానీ, సీఎం కేసీఆర్ ఇటీవల జ్వరంతో నియోజకవర్గానికి వచ్చి ఎకరానికి రూ. 10 వేల చొప్పున ప్రకటించారన్నారు. దీంతో మొదటి విడుతగా రూ. 14 కోట్లు, రెండో విడుత రూ. 42 కోట్లు కలిపి మొత్తం రూ. 56 కోట్ల నష్టపరిహారం రైతులకు అందిస్తున్నామని వివరించారు. వ్యవసాయ యాంత్రీకరణ ప్రాజెక్టుకు సహకరించిన సీఎం కేసీఆర్, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు ఈ ప్రాంత రైతుల పక్షాన ఎమ్మెల్యే పెద్ది కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ లెక్కల విద్యాసాగర్రెడ్డి, రాయిడి రవీందర్రెడ్డి, గుంటి కిషన్, దార్ల రమాదేవి, వేనుముద్దల శ్రీధర్రెడ్డి, మండల శ్రీనివాస్, గోనె యువరాజు, గంప రాజేశ్వర్గౌడ్, సంపత్రావు పాల్గొన్నారు.
కంటికి రెప్పలా కాపాడుకుంటాం
చెన్నారావుపేట: బీఆర్ఎస్లో చేరిన ప్రతి కార్యకర్తనూ కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నెక్కొండ మండలంలోని సూరిపెళ్లి గ్రామానికి చెందిన వార్డు మెంబర్ పిట్టల శ్రీకాంత్, పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి పెద్ది గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అభివృద్ధి, సంక్షేమం బీఆర్ఎస్ లక్ష్యమని, అందుకే అనేక మంది ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ మండ ల అధ్యక్షడు సంగని సూరయ్య, నాయకులు కొమ్ము రమేశ్యాదవ్, రెడ్లవాడ పీఏసీఎస్ చైర్మన్ జలగం పంపత్రావు, యూత్ అధ్యక్షుడు వంశీకృష్ణ, సర్పంచ్ గీత భాస్కర్, మాజీ సర్పంచ్ గాదె భాస్కర్, కొమ్మాలు, సుధీర్రెడ్డి పాల్గొన్నారు.