ఖిలావరంగల్, మార్చి 25: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నెలకొన్న ప్రతి సమస్యనూ పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివారం ఆయన గ్రేటర్ వరంగల్ 35వ డివిజన్లోని పుప్పాలగుట్ట, శివనగర్ ప్రాంతాల్లో కార్యకర్తలు, నాయకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం అభివృద్ధిపై స్థానికులతో మాట్లాడారు. ప్రతి కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తానన్నారు. అసంపూర్తిగా ఉన్న రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్థానికంగా ఏమైనా సమస్యలు ఉంటే నాయకులు, కార్యకర్తలు తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు. బీఆర్ఎస్ శ్రేణులు నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాల్పంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, పార్టీలకతీతంగా పథకాలను ప్రవేశపెట్టి అర్హులైన అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్, స్థానికులు, నాయకులు పాల్గొన్నారు.
వరంగల్ చౌరస్తాలో మహేశ్ కళా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రారంభించారు. వేసవిలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గందె కల్పన, సురేశ్ జోషి, సోమిశెట్టి ప్రవీణ్ పాల్గొన్నారు.