జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : గడిచిన ఐదేళ్లలో సీఎం కేసీఆర్ సహకారంతో కోట్లాది రూపాయల నిధులు తీసుకవచ్చి భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, మరోసారి ఆశీర్వదిస్తే అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం భూపాలపల్లిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. భూపాలపల్లి అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారని తెలిపారు. వీటితో సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయం, మెడికల్ కళాశాల, సింగరేణి కార్మికులకు డబుల్ బెడ్ రూం క్వార్టర్లు, నిరుపేదలకు డబుల్బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇచ్చినట్లు చెప్పారు. అంతేకాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. భూపాలపల్లికి ఇంనీరింగ్ కళాశాల, మైనింగ్ కళాశాల, ఐటీ టవర్ ఇవ్వాలని, చిట్యాల మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, గోరికొత్తపల్లి మండలాభివృద్ధికి నిధులు ఇవ్వాలని వేదికపై ఉన్న సీఎం కేసీఆర్ను కోరారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ బైపాస్ రోడ్డును మంజూరు చేశారని, త్వరలో ప్రారంభం అవుతుందన్నారు. తన గెలుపును సీఎం కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని, తద్వారా కేసీఆర్ను మూడోసారి సీఎంగా చూడాలని ప్రజలను కోరారు. సభలో నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణీ రాకేశ్, వైస్ చైర్పర్సన్ కళ్లెపు శోభా రఘుపతిరావు, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బీ వెంకట్రా వ్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, ఎంపీపీ మందల లావణ్యా సాగర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణీ సిద్ధు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బుర్ర రమేశ్గౌడ్, జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలుసాని లక్ష్మీనర్సింహారావు, టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు బడితెల సమ్మయ్య, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్నాయక్, సీనియర్ నాయకులు పైడిపల్లి రమే శ్, కుంచాల సదావిజయ్కుమార్, భారతక్క పాల్గొన్నారు.
కేసీఆర్ను మూడోసారి సీఎంగా చూసేందుకు ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి భూపాలపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి గెలిపించాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14ఏళ్లు అవిశ్రాంత ఉద్యమం జరిగిందని, కేసీఆర్ మొక్కవోని దీక్షతో ఉద్యమాన్ని ముందుకు నడిపించారని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను పదేళ్లలో భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా అన్ని రంగాల్లో ముందంజలో నిలిపి ఆదర్శంగా నిలిపారని తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గం ఒకప్పుడు ఎలా ఉండే.. ఇప్పుడు ఎలా ఉంది.. అడగందే అమ్మ అయినా అన్నం పెట్టదనే సామెత ఉంది. భూపాలపల్లి విషయంలో కేసీఆర్ మనం అడగకుండానే అన్నీ ఇచ్చి అభివృద్ధిలో ముందంజలో నిలిపాడన్నారు.