ఎవరైనా డబ్బులు అడిగితే నాకు చెప్పండి..
దళితుల సమగ్రాభివృద్ధికే పథకం
ఇప్పటివరకు 16 వందల కుటుంబాలకు లబ్ధి
ప్రతిపక్షాలకు పుట్టగతులుండవనే గగ్గోలు
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
సంగెం, జూన్ 23 : దళితబంధు ఇప్పిస్తామని ఎవరైన డబ్బులు అడిగితే వారి వివరాలు నాకు చెప్పాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలం లో ఎంపికైన దళితబంధు లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులకు ఆశాలపల్లిలోని కూచన గార్డెన్స్లో గురువా రం అవగాహన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నార ని, నిష్పక్షపాతంగా అర్హులైన వారిని ఎంపిక చేస్తున్నామని, ఎవరైనా లీడర్లు దళితబంధు ఇప్పిస్తామని పైసలు వసూలు చేస్తే వారిపై పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలతో పాటు అడ్డదారిలో ఎంపికైన వారిని స్కీమ్ నుంచి తొలగిస్తామన్నారు. స్కీమ్లో తీసుకున్న యూనిట్లను అమ్ముకోవద్దన్నారు. సీఎం ఆశయాన్ని నెరవేర్చాలన్నా రు. మరిన్ని పథకాలు అందలాంటే సీఎంగా కేసీఆర్ పదికాలాల పాటు ఉండాలన్నారు.
ప్రజలు కేసీఆర్కు అండగా నిలువాలన్నారు. దేశప్రధానికే మన రాష్ట్ర పథకాలు అంతుపట్టడం లేదన్నారు. ప్రతిపక్ష నాయకులకు పుట్టగతులుండవనే గగ్గోలు పెడుతున్నారన్నారు. నియోజకవర్గంలో 17,600 దళిత కుటుంబాలు ఉండగా, 1,600 కుటుంబాలకు దళితబంధు పథకం వర్తింపజేశామన్నారు. సంగెం మండలంలో 300 మందిని ఎంపిక చేసినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలోని దళితులకు కూడా దళిబంధు పథకం వర్తింపజేస్తామన్నారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, ఎంపీపీ కందకట్ల కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పసునూరి సారంగపాణి, వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, సొసైటీ చైర్మన్లు వేల్పుల కుమారస్వామి యాదవ్, సంపత్గౌడ్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.