వరంగల్ : పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో అద్భుత ఫలితాలు సాధించామని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. తెలంగాణ పల్లెలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా నిలుస్తున్నాయన్నారు. రూ.2కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి.
పర్వతగిరి మండలం ఇస్లావత్ తండా, చెరువుకొమ్ము తండా, ఏబీ తండా, దౌలత్ నగర్ గ్రామాల్లో సుమారు రూ. 2కోట్లతో చేపట్టిన వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డ్, అంతర్గత సీసీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్య తెలంగాణను నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. అందులో భాగంగా ప్రతి నెల గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
పల్లె ప్రగతి కార్యక్రమంతో ఇప్పటికే గ్రామాల్లో ఘననీయమైన అభివృద్ధిపనులు జరుగుతున్నాయని తెలిపారు. అన్ని గ్రామాల్లో తప్పనిసరిగా వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.