వర్ధన్నపేట, ఏప్రిల్ 24 : పార్టీ ఆవిర్భావం సందర్భంగా మంగళవారం వర్ధన్నపేటలో నిర్వహించనున్న నియోజకవర్గస్థాయి బీఆర్ఎస్ ప్రతినిధుల సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అరూరి రమేశ్ పిలుపునిచ్చారు. సోమవారం పార్టీ ప్రతినిధుల సభ ఏర్పాట్లను డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, స్థానిక నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ 23వ ఆవిర్భావం సందర్భంగా నియోజకవర్గ కేంద్రం సమీపంలోని లక్ష్మీగార్డెన్స్ పక్కన ఉన్న మైదానంలో నియోజకవర్గస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అన్ని మండలాలు, వరంగల్ నగర విలీన గ్రామాల నుంచి సుమారు 4వేల మంది వరకు పార్టీ ప్రతినిధులు సభకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. పార్టీ ఆవిర్భావం సందర్భంగా అన్ని గ్రామాల్లో ఉదయం ప్రజాప్రతినిధులు, పార్టీ బాధ్యులు ప్రధాన కూడళ్ల వద్ద జెండాలను ఆవిష్కరించాలని సూచించారు. అలాగే, గ్రామాల్లోని పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి, సభకు హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోతు అరుణ, వైస్చైర్మన్ ఎలేందర్రెడ్డి, కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్రావు, ఆత్మ చైర్మన్ గుజ్జ గోపాల్రావు, పార్టీ నాయకులు తూళ్ల కుమారస్వామి, సిలువేరు కుమారస్వామి, చొప్పరి సోమయ్య, పాలకుర్తి సారంగపాణి, పులి శ్రీనివాస్, కొండేటి శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఐనవోలులో సన్నాహక సమావేశం
ఐనవోలు : వర్ధన్నపేటలో నిర్వహించే ప్రతినిధుల సభ విజయవంతం కోసం మంగళవారం మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యనాయకులతో ఎమ్మెల్యే అరూరి రమేశ్ సన్నాహక సమావేశం నిర్వహించారు. డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావుతో కలిసి కార్యకర్తలతో మాట్లాడారు. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కానున్నందున ముందుగా అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి, తెలంగాణ తల్లి చిత్ర పటానికి పూలమాల వేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గం వ్యాప్తంగా డివిజన్ల, గ్రామాల్లో కలపుకొని మొత్తం 230 పైగా బీఆర్ఎస్ జెండాలు ఎగురుతాయన్నారు. మండలాల వారీగా నిర్దేశించిన జంక్షన్ల్లో ర్యాలీలు నిర్వహించాలన్నారు. సభకు హజరయ్యే ప్రతినిధులు గులాబీ రంగు దుస్తులు ధరించాలని సూచించారు. నియోజకర్గంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి పై మరియు రాబోయే రోజుల్లో చేయబోయే అభివృద్ధి పై క్షుప్తంగా వివరించనట్లుగా పేర్కొన్నారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ గజ్లెల్లి శ్రీరాములు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షురాలు ఎల్లావుల లలితాయాదవ్, జడ్పీ కోఆప్షన్ మెంబర్ ఉస్మాన్అలీ, ప్రజాప్రతినిధులు, వివిధ మండల అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.