వరంగల్ చౌరస్తా, మార్చి 27: పేదలకు ఉచిత కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందించడానికి మెగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం 12 లక్షల చదరపు అడుగుల స్థలంలో రెండు వేల పడకల సామర్థ్యంతో భవనం నిర్మిస్తోందని ఆయన తెలిపారు. వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో చేపట్టిన హాస్పిటల్ నిర్మాణ పనులను సోమవారం ఆయన తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్తో కలిసి పరిశీలించారు. మంత్రికి హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఎల్అండ్టీ సంస్థ ప్రతినిధులతో కలిసి ఆర్అండ్బీ అధికారులు నిర్మాణ పనులను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సూచించిన మార్పులకు అనుగుణంగా నేషనల్ బిల్డింగ్ కోడ్ నిబంధనల ప్రకారం పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 60 శాతం పనులు పూర్తయ్యాయని, రానున్న సెప్టెంబర్ నాటికి పనులు పూర్తి చేసి, ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం దసరా నాటికి వైద్య సేవలు ప్రారంభించడానికి చర్యలు చేపట్టినట్లు వివరించారు.
ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా వైద్యసేవలందిస్తున్న ఎంజీఎం దవాఖానను మరింత బలోపేతం చేయడానికి, మెరుగైన వైద్య సేవల కోసం హైదరాబాద్ వరకు రావాల్సిన అవసరం లేకుండా అధునిక వైద్య సేవలను ఇక్కడే అందించడానికి ప్రభుత్వం రూ.1100 కోట్ల వ్యయంతో దవాఖాన నిర్మిస్తోందని చెప్పారు. హెల్త్ సిటీ ఐకాన్గా మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిలువనుందని వివరించారు. అదేవిధంగా హైదరాబాద్ ఎల్బీ నగర్లో రూ.900 కోట్లతో వెయ్యి పడకల సామర్థ్యం, సికింద్రాబాద్ అల్వాల్ ప్రాంతంలో రూ.వెయ్యి కోట్లతో వెయ్యి పడకల దవాఖానతో పాటు 200 పడకల సామర్థ్యం కలిగిన మాతా శిశు సంరక్షణ కేంద్రం, సనత్నగర్ ప్రాంతంలో రూ.900 కోట్ల వ్యయంతో వెయ్యి పడకల హాస్పిటల్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. టిమ్స్, నిమ్స్ను 1600 కోట్ల వ్యయంతో ఆధునీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన వైద్య కళాశాలల్లో తెలంగాణకు ఒక్కటి కూడా రాలేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖను మరింత పటిష్టం చేసేందుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని పేర్కొన్నారు. అనంతరం ఆయన అధికారులతో కలిసి హాస్పిటల్ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. మంత్రి వెంట వరంగల్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీవత్స, హనుమకొండ ఆర్డీవో వాసుచంద్ర, వరంగల్ ఆర్డీవో మహేందర్జీ, ఆర్అండ్బీ ఎస్ఈ గణపతిరెడ్డి, వరంగల్ ఏసీపీ బోనాల కిషన్, ఎల్అండ్టీ సంస్థ ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన కాజీపేట అదనపు ఆర్వోబీ నిర్మాణ పనుల వేగాన్ని పెంచాలని మంత్రి ఆదేశించారు. ఆర్వోబీ నిర్మాణ బాధ్యతలు చేపట్టిన శ్రీవెంకటేశ్వర కన్స్ట్రక్షన్స్ సంస్థ ప్రతినిధులు శ్రీనివాసరెడ్డి, దేవేందర్రెడ్డితో మంత్రి మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైల్వే ట్రాక్పై నిర్మాణ పనులకు సంబంధించిన అనుమతులు ఆలస్యం కారణంగా పనుల్లో వేగం తగ్గిందని, ఇటీవలే రైల్వే శాఖ అనుమతి మంజూరు చేసిందని, త్వరలో పనులను పూర్తి చేస్తామని మంత్రికి వివరించారు. రైల్వే అధికారులు ఇంతకాలం ఇబ్బందులకు గురి చేయడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు.
హాస్పిటల్ నిర్మాణ పనుల్లో వేగం పెంచడానికి ఎల్అండ్టీ సంస్థ ప్రతినిధులు, ఆర్అండ్బీ అధికారులు నూతన సెంట్రింగ్ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ విధానం ద్వారా తదుపరి చేపట్టే పనులు వేగవంతమవుతాయని సిబ్బంది తెలిపారు. ఇప్పటి వరకు 10 అంతస్తుల నిర్మాణం పూర్తయ్యిందని, తదుపరి చేపట్టే నిర్మాణానికి అనుగుణంగా ముందుగానే సెంట్రింగ్ నమూనాను నేల మీద సిద్ధం చేసుకొని, నంబర్లు వేస్తున్నారు. క్రేన్తో విడిభాగాలు పై అంతస్తుకు చేర్చి బిగించడం మూలంగా తక్కువ సమయంలో ఎక్కువ పని జరుగుతోంది. స్లాబ్ నిర్మాణం తర్వాత సమయం వృథా కాకుండా మరో అంతస్తు నిర్మాణానికి తగిన విధంగా సెంట్రింగ్ నమూనాను వెంట వెంటనే సిద్ధం చేస్తున్నారు.