తాడ్వాయి, జనవరి 6 : మేడారం మహా జాతర సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె రహదారుల మరమ్మతులు, అభివృద్ధి పనులను కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరీశ్, ఐటీడీఏ పీవో అంకిత్తో కలిసి పరిశీలించారు. ముందుగా చింతల్క్రాస్ వద్ద పార్కింగ్ స్థలం, బీటీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలన్నారు. అనంతరం ఊరట్టం లోలెవల్ కాజ్వే మరమ్మతు పనులను ప్రారంభించారు. జంపన్నవాగు వరదల కారణంగా ఊరట్టం వద్ద ఎక్కువగా నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున కరకట్ట నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతరకు ప్రభుత్వం రూ.75కోట్లు మంజూరు చేసిందని, అదనంగా నిధుల కోసం అదికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సారి జాతరను అత్యంత వైభవంగా నిర్వహించడంతో పాటు మేడారం విశిష్టత ప్రపంచ నలుమూలలా తెలిసేలా చర్యలు తీసుకుంటామన్నారు. జాతరకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరామని, త్వరలోనే ప్రకటన వస్తుందని ఆశిస్తున్నామన్నారు. భక్తుల సౌకర్యాల కల్పనకు సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలను భక్తులు ఎక్కడపడితే అక్కడ వేస్తున్నారని, దీని వల్ల స్థానిక గిరిజనులు ఇబ్బందులకు గురవుతున్నారని, ప్లాస్టిక్, సీసాలను ఒకచోట పడవేయాలని భక్తులను కోరారు. జాతర సమీపిస్తున్నందున ఈ నెల చివరిలోగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సీతక్క సమ్మక్క, సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రివెంట అదనపు కలెక్టర్లు శ్రీజ, వేణుగోపాల్, అధికారులు ఉన్నారు.
లోలెవల్ కాజ్వేకు మరమ్మతులు
ఊరట్టం సమీపంలోని లోలెవల్ కాజ్వే మరమ్మతు పనులను శనివారం ఐటీడీఏ ఇంజినీరింగ్శాఖ అధికారులు ప్రారంభించారు. ఖమ్మం, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల నుంచి ప్రైవేట్ వాహనాల్లో వచ్చే భక్తులను ఏటూరునాగారం మండలంలోని కొండాయి, ఊరట్టం గ్రామ సమీపంలోకి అనుమతిస్తారు. అక్కడ వారు విడిది చేసిన అనంతరం అమ్మవార్లను దర్శించుకునేందుకు ఈ కాజ్వే నుంచే గద్దెల వద్దకు చేరుకునే అవకాశం ఉంటుంది. వరదల కారణంగా కాజ్వే కొట్టుకుపోవడంతో సుమారు రూ.25లక్షలతో మరమ్మతు పనులు చేస్తున్నారు. అలాగే ఊరట్టం స్తూపం నుంచి అమ్మవార్ల గద్దెల వరకు గల రహదారిలో ప్యాచ్వర్క్ పనులను శనివారం ఆర్అండ్బీ అధికారులు ప్రారంభించారు. పాడైన రోడ్డు స్థానంలో కొత్త బీటీ వేస్తున్నారు.