వేలేరు, ఫిబ్రవరి 26 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సోమవారం వేలేరు మండలం సోడాషపల్లికి రానున్నారు. స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలోని ఎగువ ప్రాంతాలైన చిల్పూరు, ధర్మసాగర్, వేలేరు రైతులకు సాగునీరందించే మూడు మినీ ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టడంతో పాటు ధర్మసాగర్-వేలేరు డబుల్రోడ్డుకు ప్రారంభోత్సవం, నారాయణగిరి-పీచర రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం రూ.150కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం సోడాషపల్లి శివారులో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ మేరకు సభ ఏర్పాట్లను శనివారం ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డి ఆదివారం పరిశీలించారు.
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం వేలేరు మండలంలోని సోడాషపల్లిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సోడాషపల్లి శివారులో ఏర్పాటుచేసిన రైతు కృతజ్ఞత సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అంతకుముందు స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలోని ఎత్తైన ప్రాంతాలకు సాగునీరందించే పైపులైన్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఆదివారం సభాస్థలాన్ని ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డి పరిశీలించారు. సభా ప్రాంగణంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా దగ్గరుండి పర్యవేక్షించారు. అలాగే కేటీఆర్ సభకు వచ్చే కార్యకర్తలు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. సభకు సుమారు 30 వేల మంది హాజరుకానున్నట్లు తెలిపారు.
రూ.25 కోట్లతో డబుల్రోడ్డు ప్రారంభోత్సవం
ధర్మసాగర్ మండల కేంద్రం నుంచి వేలేరు మండల కేంద్రం వరకు సుమారు రూ.25 కోట్లతో వేసిన డబుల్రోడ్డును మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. అలాగే రూ. 10 కోట్లతో నారాయణగిరి నుంచి పీచర వరకు డబుల్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
రూ.104 కోట్లతో మూడు లిఫ్ట్లు ప్రారంభం
స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలోని ఎగువ ప్రాంతాలైన చిల్పూరు, ధర్మసాగర్, వేలేరు మండలాలకు సాగునీరు అందించేందుకు దేవాదుల పైపులైన్ ద్వారా మూడు లిఫ్ట్లు ఏర్పాటు చేపి పైపులైన్ ద్వారా మూడు మండలాల్లోని చెరువుల్లోకి నీటిని పంపించనున్నారు. తద్వారా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సాగునీరు వచ్చి ఎగువ ప్రాంతమంతా సస్యశ్యామలం కానున్నది. ఫలితంగా ఘన్పూర్ నియోజకవర్గం మరో కోనసీమగా మారనున్నది.