హుజూరాబాద్/టౌన్/రూరల్, నవంబర్ 27 : “రైతులను అన్ని విధాలుగా అండగా ఉంటూనే నిరంతర కరెంటు ఇస్తున్న బీఆర్ఎస్ కావాలా? మూడు గంటల కరెంటు చాలు అనే దరిద్రపు కాంగ్రెస్ కావాలా? మీరే ఆలోచించి ఓటేయండి. ఇప్పటికే కాంగ్రెస్కు ఓటేసి తప్పుచేశామని కర్ణాటక ప్రజలు చెంపలేసుకుంటున్నారు. అలాంటి పరిస్థితి ఇక్కడ రావద్దు. కాంగ్రెస్, బీజేపీ కుట్ర చేసి రైతుల నోటికాడి బుక్క లాక్కున్నట్టు రైతుబంధును ఆపించినయ్. ఆ పార్టీలకు ఓటుతోనే బుద్ధి చెప్పాలి. మోదీ ప్రియమైన ప్రధాని కాదు.. పిరమైన ప్రధాని. కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ వందల మందిని బలితీసుకున్న బలిదేవత” అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం హుజూరాబాద్ పట్టణంలో నిర్వహించిన రోడ్షోలో పార్టీ అభ్యర్థి, మండలి విప్, బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డితో కలిసి పాల్గొన్నారు.
సుమారు 30 వేలకు పైగా వచ్చిన ప్రజలతో పట్టణ వీధులు కిక్కిరిసి పోగా, వారినుద్దేశించి అమాత్యుడు రామన్న ప్రసంగించారు. ఎన్నికలు వ్యక్తుల మధ్య కాదని, పార్టీల మధ్య పోరు జరుగుతుందని, అభివృద్ధి చేసే పార్టీ వైపు ఉండాలని సూచించారు. నాటి తెలంగాణ ఉద్యమంలో ఎంతోమందిని కాల్చి చంపిన దుర్మార్గపు చరిత్ర కాంగ్రెస్దేనని, మొన్న జరిగిన ఉద్యమంలో ఎంతో మందిని పొట్టన పెట్టుకున్న బలి దేవత సోనియాగాంధీ అని మండిపడ్డారు.రైతుబంధును నిలిపివేయాలని ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్, బీజేపీ లేఖలు రాశాయన్నారు. రైతుల మేలు కోసం రైతు బంధు ఇవ్వాలని సీఎం కేసీఆర్ కేంద్ర ఎన్నికల కమిషన్కి విజ్ఞప్తి చేయగా అధికారులు పచ్చ జెండా ఊపారని, మళ్లీ కిరికిరి పెట్టి అడ్డుకున్న దుర్మార్గులు కాంగ్రెస్, బీజేపీ నాయకులని మండిపడ్డారు. రైతుబంధు వస్తే రైతులంతా బీఆర్ఎస్కే ఓటు వేస్తారని కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి కుట్రలు పన్ని, రైతుల నోటి కాడికి వచ్చిన ముద్దను గద్దలు లాకున్నట్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీల సన్నాసులకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
2014కు ముందు తెలంగాణలో కరెంటు కష్టాలు ఎలా ఉండేవో ప్రజలకు తెలుసునని, అప్పుడు ఎవరైనా చనిపోతే స్నానాలు చేయడానికి పది నిమిషాల కరెంటు ఇవ్వాలని అధికారులను బతిమిలాడుకునే రోజులు ఉండేనని గుర్తు చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ మొత్తం 24 గంటల కరెంటు ఇస్తూ ప్రతి ఇంటిలో వెలుగులు నింపిందని, కరెంటు కావాలో.. కాంగ్రెస్ కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు. అన్ని రకాలుగా తెలంగాణ ప్రజలను అరిగోస పెట్టిన కాంగ్రెస్ దరిద్రం మళ్ళీ కావాలా? అంటూ ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ ధన్ధన్గా జన్ ధన్ ఖాతాలు తీయమని చెప్పి, రూ.15 లక్షలు ఖాతాలో వేస్తామని కనీసం రూ.15లు కూడా వేశారా? అని ప్రశ్నించారు.
కేంద్రం రూ.15 లక్షలు వేస్తే బీజేపీకి ఓటు వేయాలని, లేదంటే రైతుబంధు, దళిత బంధు డబ్బులను ఖాతాల్లో వేసిన కేసీఆర్ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. దేశంలో పప్పు, ఉప్పు వంటి అన్ని నిత్యవసర వస్తువుల ధరలు ఐగ్గె మండుతున్నాయని, అందుకే ప్రియమైన ప్రధానమంత్రి అనడం మానేసి ప్రజలంతా పిరమైన ప్రధాని అంటున్నారని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈసారి హుజూరాబాద్లో కౌశిక్రెడ్డిని గెలిపిస్తే ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చే బాధ్యత తీసుకుంటానని మాటిచ్చారు. గతంలో జరిగిన తప్పు ఇప్పుడు చేయద్దని కోరారు. ఇక్కడి ప్రజల అభిమానం చూస్తుంటే కౌశిక్రెడ్డి ఎమ్మెల్యేగా గెలువడం ఖాయం అనిపిస్తుందన్నారు. సిరిసిల్ల తరహాలో అభివృద్ధి జరగాలంటే అక్కడ వచ్చిన మెజార్టీ కన్నా ఇక్కడ వస్తేనే హుజూరాబాద్ సుందరవనంగా మారుతుందని చెప్పారు.