వరంగల్, మే 13 : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్యను ప్రశంసించారు. ‘పట్టణ ప్రగతి-2022’పై హైదరాబాద్లోని జెన్కో భవన్లో శుక్రవారం మేయర్లు, చైర్మన్లు, కమిషనర్, అదనపు కలెక్టర్లకు జరిగిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణ ప్రగతి నిధులతో గ్రేటర్ వరంగల్లో 450 మరుగుదొడ్లు నిర్మించినందుకు మేయర్, కమిషనర్ను అభినందించారు. దీంతో పాటు గ్రేటర్లోని 1,018 సీట్ల సామర్థ్యం కలిగిన మరుగుదొడ్లను సక్రమంగా నిర్వహించడంతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పించినందుకు ప్రశంసించారు.
పబ్లిక్, కమ్యూనిటీ, మొబైల్ టాయిలెట్లు, పెట్రోల్ పంపుల్లో టాయిలెట్లు నిర్వహిస్తూ పటిష్ట నిర్వహణకు 18 అంశాలు పాటించడంపై మంత్రి కేటీఆర్ అభినందించారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. అనంతరం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చేతుల మీదుగా మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య జ్ఞాపికతో పాటు ప్రశంసాపత్రం అందుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్కుమార్, సీడీఎంఏ సత్యనారాయణ, ఈఎన్సీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.