వరంగల్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నినాదంతో తెలంగాణ ఉద్యమం నడిచిందని, ఇప్పుడవన్నీ సాకరమవుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ మంత్రి కే తారకరామారావు చెప్పారు. వేలేరు మండలం షోడాషపల్లిలో సోమవారం నిర్వహించిన రైతుకృతజ్ఞత సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో మన నిధులు మనకు వస్తున్నాయని, ఇదే ప్రక్రియలో సోమవారం ఒక్కరోజే స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో రూ.127కోట్లతో పనులు మొదలు పెట్టుకున్నామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ రోజూ ఇలా జరుగలేదని, మన రాష్ట్రం మనకు వచ్చింది కాబట్టే మన నిధులు మనకు వస్తున్నాయన్నారు. కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ దేవాదుల ప్రాజెక్టుకు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, ప్రతి ఎకరాకు నీరు అందించేందుకు ఇంకా ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు.
ప్రభుత్వ శాఖల్లో 2.21 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసుకుంటున్నామని తెలిపారు. కొందరు రాజకీయ నిరుద్యోగులు, దివాలాకోరు రాజకీయం చేసేవాళ్లు పనికిమాలిన పాదయాత్రలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, ప్రజాప్రతినిధులమంతా ఐకమత్యంతో ముందుకుసాగుదామని పిలుపునిచ్చారు. ‘పీసీసీ అధ్యక్షుడు మీ జిల్లాలోనే మాట్లాడేందుకు ఏమీ లేక చందమామలో మచ్చలను వెతికినట్లుగా ఏదేదో అంటున్నడు. ఒక్క చాన్స్ ఇవ్వండని అడుక్కుంటున్నడు. ఒక్క చాన్స్ కాదు, దిక్కుమాలిన మీ పార్టీకి పదిసార్లు అంటే 50 ఏండ్లు ప్రజలు అధికారం ఇచ్చిండ్లు. అప్పుడు ఏం పీకిండ్రు?. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? ఉచిత కరెంట్, రైతు బీమా, రైతు బంధు ఇవ్వాలన్న ఆలోచన కాంగ్రెస్కు ఏనాడైనా వచ్చిందా? అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయని మీరు ఇప్పుడు ఒక్క చాన్స్ ఇవ్వాలని అడిగితే తెలంగాణ ప్రజలు తెలివితక్కువ వారు కాదు. ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతుల ముఖం తెలివి అవుతోంది.
ప్రతి పక్షాలకు చెప్పడానికి ఏం లేవు. ఏం తోచక కుటుంబ పాలన అంటూ మాట్లాడుతున్నారు. నేనే చెప్తున్నా.. బరాబర్ మాది కుటుంబపాలనే. నాలుగు కోట్ల మంది తెలంగాణ బిడ్డలు మా కుటుంబ సభ్యులే. నాలుగు కోట్ల మంది బిడ్డలకు కుటంబ పెద్ద కేసీఆర్. 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో 65 వేల కోట్ల రూపాయలు వేసిన సీఎం కేసీఆర్ వారికి పెద్దన్నలా నిలబడ్డడు. మాది నాలుగు కోట్ల మందితో ఉన్న వసుధైక కుటుంబ పాలనే. మనకు కులం పంచాయితీ లేదు, మతం పిచ్చి లేదు. జనహితమే మా అభిమతం, అభివృద్ధే మన కులం, సంక్షేమమే మన మతం.’ అని స్పష్టం చేశారు. కార్యక్రమాల్లో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, అరూరి రమేశ్, ఒడితల సతీశ్కుమార్, చల్లా ధర్మారెడ్డి, బానోత్ శంకర్నాయక్, గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ చైర్పర్సన్లు ఎం.సుధీర్కుమార్, పాగాల సంపత్రెడ్డి, గండ్ర జ్యోతి, కుసుమ జగదీష్, కుడా చైర్మన్ సుందరాజ్యాదవ్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు సాయిచంద్, నాగుర్ల వెంకటేశ్వర్లు, వై.సతీశ్రెడ్డి, కే వాసుదేవారెడ్డి, మెట్టు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీలు ఎం.శ్రీనివాస్రెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.
ప్రీతికి అన్యాయం చేసినవారిని వదిలిపెట్టం
‘డాక్టర్ ప్రీతి దురదృష్టవశాత్తు చనిపోతే రాజకీయం చేస్తున్నరు.. ఆమె కుటుంబానికి ప్రభుత్వం, పార్టీ పరంగా అండగా ఉంటాం..ప్రీతికి అన్యాయం చేసిన ఎవరినీ వదిలిపెట్టం.. సైఫ్ అయినా.. సంజయ్ అయినా ఎవరినీ వదిలిపెట్టేది లేదు.’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.
కాబోయే సీఎం కేటీఆర్ : ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య
‘మన రాష్ట్రంలో మన పనులు మనం చేసుకుంటున్నం. కొందరు రాజకీయ నిరుద్యోగులు, దివాలాకోరు రాజకీయం చేసేటోళ్లు తిరుగుతున్నరు. పనికి మాలిన పాదయాత్రలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నరు.. బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు ఐకమత్యంతో ముందుకుసాగాలి’ అని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సూచించారు. వేలేరు మండలం షోడాషపల్లిలో ఎమ్మెల్సీ పల్లా, ఎమ్మెల్యే రాజయ్య ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన రైతుకృతజ్ఞత సభలో మంత్రి రామన్న ప్రసంగించారు. ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నినాదంతో తెలంగాణ ఉద్యమం కొనసాగిందని, ఇప్పుడు అవన్నీ సాకారమవుతున్నాయని స్పష్టం చేశారు.
రైతులకు ఎదురుపెట్టుబడి..
ధర్మసాగర్: రైతులకు ఎదురుపెట్టుబడి పెడుతున్న మహానుభావుడు సీఎం కేసీఆర్. 24 గంటల కరంటు, రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ, అందుబాటులో విత్తనాలు, ఎరువులు తెచ్చిన ఘనత ఆయనకే దక్కింది. కరువుతో కొట్టుమిట్టాడుతున్న ఈ ప్రాంతానికి నీళ్లిచ్చేందుకు రూ. 127 కోట్లతో 3 లిఫ్ట్లు శంకుస్థాపన చేసుకున్నాం. వీటి ద్వారా మూడు జిల్లాలు, మూడు నియోజకవర్గాలు, 9 మండలాల్లోని 30 గ్రామాల్లో 53 చెరువులు నింపడం ద్వారా 6, 794 ఎకరాల ఆయకట్టుకు ఏడాదిలో సాగు, తాగు నీరు అందుతుంది. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య కలిసికట్టుగా పనిచేస్తున్నారు. వీరు ఈ నియోజకవర్గంలో ఉన్నందుకు మీరు అదృష్టవంతులు. గతంలో అభివృద్ధి ఎలా ఉండేది?, ఇప్పుడు ఎలా ఉంది? అని ప్రజలు ఆలోచించాలి. తెలంగాణ రాకముందు ఈ ప్రాంతంలో నీటి కటకటలు, ఎండా కాలం వస్తే నీటికి కూడా సరిపోయే నిధులు ఉండకపోయేవి. ఇప్పుడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఈ ప్రాంతం సస్యశామలం అవుతోంది. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి ప్రజలంతా అండగా ఉండాలి.
– మంత్రి దయాకర్రావు
పేదల కష్టాలు తెలిసిన నాయకుడు
ధర్మసాగర్: పేదల కష్టాలు తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్. బడుగు, బలహీన వర్గాల వారికి ఆయన పాలన ఒక స్వర్ణయుగం. ఇందుకు రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలే నిదర్శ నం. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి అనేక పథకాలను ప్రవేశపెట్టింది. పార్టీలకతీతంగా అర్హులకు పింఛన్ అందిస్తోంది. గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణాలకు రూ.20లక్షలు మంజూరు చేశారు. ఇందుకోసం పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖ నుంచి రూ. 600 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలకు గిరిజనులను ఓటు అడిగే హక్కు లేదు. దేశాన్ని ఇన్నేళ్లుగా పాలించిన కాంగ్రెస్, ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వారి కోసం ఏం చేశారో ప్రజలకు వివరించాలి. వారికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా దేశ రాజధాని ఢిల్లీలో బంజారా భవన్ నిర్మించాలి. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో గిరిజనులకు సముచిత స్థానం కల్పించారు.
– మంత్రి సత్యవతి రాథోడ్
కాబోయే సీఎం కేటీఆర్
ధర్మసాగర్: రాబోయే రోజుల్లో కాబోయే సీఎం కేటీఆర్. నిండు మనస్సుతో ఈ ప్రాంతంపై ప్రేమ ఉంచాలి. ఈ నియోజకవర్గం నాకు రాజకీయ జన్మినిచ్చింది. నాకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ప్రజల మనస్సులో పదిలంగా ఉన్నాను. ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం నా శక్తి మేరకు నిజాయితీగా పనిచేస్తాను. నూతనంగా ఏర్పడిన వేలేరు, చిల్పూర్ మండలాలకు ప్రభుత్వ మండల కాంప్లెక్స్లు మంజూరు చేయాలి. హనుమకొండ జిల్లా నుంచి జనగామ మీదుగా ధర్మసాగర్, వేలేరు, చిల్పూర్, తరిగొప్పుల మండల కేంద్రాలను కలుపుకొని కొత్తగా డబుల్ బీటీ రోడ్డు మంజూరు చేయాలి. స్టేషన్ఘన్పూర్, శివునిపల్లి, ఛాగల్ను కలుపుకొని మున్సిపాలిటీ చేయాలి. నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కాలేజీ, 100 పడకల దవాఖాన, రఘునాథపల్లి, లింగాల ఘన్పూర్, వేలేరు మండలాలకు నూతనంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీ మంజూరు చేయాలి. దేవాదుల ఎత్తిపోతల పథకానికి ఇంకో రూ. 1000 కోట్లు ఖర్చు చేస్తే రెండో, మూడో దశ పనులు పూర్తవుతాయి. – ఎమ్మెల్సీ కడియం శ్రీహరి..
‘దేవాదుల’తో ఈ ప్రాంతం సస్యశ్యామలం
ధర్మసాగర్: దేవాదుల ప్రాజెక్టుతో స్టేషన్ఘన్పూర్, జనగామ నియోజకవర్గాలు సస్యశ్యామలం కానున్నాయి. రాష్ట్రం రాకముందు ఈ ప్రాంతంలో వేసవి కాలంలో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉండేది. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం కొనసాగుతోంది. ఇప్పుడు శంకుస్థాపన చేసుకున్న ప్రాజెక్టు పూర్తయితే ధర్మసాగర్, వేలేరు, చిల్పూర్ మండలాల్లోని గ్రామాలకు 90 శాతం వరకు సాగునీరు అందుతుంది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో నక్సలిజం, ప్రగతి శీల ఉద్యమాలు జరిగాయి. ఇప్పుడు ప్రజలకు ఏమి అవసరమో వాటిని గుర్తించి అభివృద్ధి పనులు చేపడుతున్నాం. వేలేరు మండలం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ను కోరిన వెంటనే ఆమోదం తెలిపారు. ఈ ప్రాంతంపై ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. అభివృద్ధి విషయంలో మన ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి తోడుగా నేనున్నా. రానున్న రోజుల్లో కూడా ఈ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురడం ఖాయం.
– ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి
పదవిని తృణప్రాయంగా వదిలేసిన..
వేలేరు: తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన. రాష్ట్ర ఏర్పాటు కోసం అధికార పార్టీకి, ఎమ్మెల్యే పదవిని గడ్డిపోచలాగా వదిలేసి ఎవరూ చేయలేని సాహసం చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరాను. అనాడు మంత్రి కేటీఆర్తో కలిసి చేసిన పాదయాత్ర మర్చిపో లేనిది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి ఏ పని కావాలన్నా చేస్తూ, నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడుతున్నారు. నేడు శంకుస్థాపన చేసిన ఎత్తిపోతల పథకం పనులు పూర్తయితే ఘన్పూర్ నియోజకవర్గంలో కరువు అనేది ఉండది. నియోజకవర్గ కేంద్రంలో మహిళా డిగ్రీ కళాశాల, డిగ్రీ కాలేజీ గతంలో మంజూరు కాగా, అనివార్య కారణాల వల్ల పూర్తి కాలేదు. వాటిని ఇప్పుడు మంజూరు చేయాలి. కొత్తగా ఏర్పడిన గ్రామపంచాయతీలకు నూతన భవనాలు మంజూరు చేసిన మంత్రులకు కృతజ్ఞతలు. – ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య
భారత్ వెలగాలంటే కేసీఆర్ రావాల్సిందే
వేలేరు: అభివృద్ధిలో భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించాలి. సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి కావాలి. రాష్ట్ర ప్రజలకు ఏం కావాలో ఆయనకు తెలుసు. ఇప్పుడు తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశవ్యాప్తం చేయాలనే సంకల్పంతో బీఆర్ఎస్కు నాంది పలికారు. రాష్ట్రంలో కొంతమంది మత విద్వేషాలను రెచ్చగొడుతూ, అల్లర్లు సృష్టిస్తున్నారు. అలాంటి వారికి ప్రజలే బుద్ధి చెబుతారు. రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేకనే కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతోది. దేశంలో మార్పులు తీసుకురావాలని సీఎం కేసీఆర్ తొలి అడుగు వేశారు. ఆయన ఒక్క అడుగు వేస్తే మనం వెయ్యి అడుగులు వేసి బలాన్ని ఇవ్వాలి.
– ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి