సమ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులు.. వారి సేవలు అమూల్యమైనవి.. విద్యార్థులు గురువుల బోధనలను శ్రద్ధగా విని బాగా చదవాలి.. ఉన్నత శిఖరాలు అధిరోహించాలి.. అనుకున్న లక్ష్యాన్ని సాధించేవరకు శ్రమించాలి.’ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పర్వతగిరి జడ్పీ హైస్కూల్లో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్తో కలిసి ఉపాధ్యాయులను సన్మానించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్దే మార్గ నిర్దేశకులు గురువులన్నారు. అనంతరం తాను చదువుకున్న పాఠశాల అభివృద్ధికి రూ.5లక్షల విరాళం అందజేశారు. నర్సంపేటలోని మోడల్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఉపాధ్యాయులను సన్మానించారు. హనుమకొండ అంబేద్కర్ భవన్లో జరిగిన గురు పూజోత్సవం కార్యక్రమంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు కలెక్టర్ బీ గోపి ప్రశంసాపత్రాలు అందజేశారు.
పర్వతగిరి, సెప్టెంబర్ 5 : విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థానాలను చేరుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ తండ్రి అరూరి గట్టుమల్లు స్మారకార్థం ప్రతి ఏటా నిర్వహించే గురుపూజోత్సవం కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్ర పటానికి పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం మాట్లాడారు. గురువులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గొప్ప మార్గదర్శకులని చెప్పారు. గురువుల శిక్షణలో పిల్లలు తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలని, తల్లిదండ్రులు, గ్రామం, పాఠశాల, ఉపాధ్యాయులు, దేశానికి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భం గా తాను చదువుకున్న రోజుల స్మృతులను అక్కడి విద్యార్థులతో పంచుకున్నారు. ఉపాధ్యాయులను సత్కరించి, ప్రశంసా పత్రాలు అందజేసారు. అనంతరం పాఠశాల అభివృద్ధికి రూ.5 లక్షల చెక్కు ప్రిన్సిపాల్కు అందించారు. మంత్రి కూతురు, కుమారుడి కష్టార్జితం నుంచి ఈ ఆర్థికసాయం అందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, ఎంపీపీ కమల, సర్పంచ్ మాలతి, ఎంపీటీసీ మాడ్గుల రాజు, బొట్ల మహేంద్ర, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పట్టపురం ఏకాంతంగౌడ్, జితేందర్రెడ్డి, ఎంఈవో సత్యనారాయణరావు, హెచ్ఎం జలీల్ పాల్గొన్నారు.
బీజేపీకి బుద్ధి చెప్పాలి..
పర్వతగిరి : సీఎం కేసీఆర్కు ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలని, కరోనా సమయంలో అప్పు తెచ్చి మరీ పెన్షన్లు ఇచ్చారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. పర్వతగిరిలో ఎమ్మెల్యే అరూ రితో కలిసి పలువురికి పెన్షన్ కార్డులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీకి తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గరలో ఉందన్నా రు. ప్రతి ఒక్కరి కోసం సంక్షేమ పథకాలను మన ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తున్నదన్నారు. అన్ని కులాల వారిని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నారన్నారు. ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ.. ఒక్క పర్వతగిరికే నెల నెలా రూ. కోటీ 35లక్షలను పెన్షన్ రూపంలో అందిస్తున్నామని చెప్పారు. కొత్తగా 337 మందికి పెన్షన్లు మంజూరైనట్లు చెప్పారు. ప్రజల కోసం ఆలోచించే ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వ మేనని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ హరిసింగ్, జడ్పీటీసీ సింగ్లాల్, పీఏసీఎస్ చైర్మన్ మనోజ్కుమార్, గొర్రె దేవేందర్, ఎంపీడీవో చక్రాల సంతోష్కుమార్, తహసీల్దార్ కొమీ, మాజీ ఎంపీపీ రంగు రజిత, మండలాధ్యక్షుడు రంగు కు మార్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, పర్వతగిరిలో పెన్షన్దారులతో మంత్రి ఎర్రబెల్లి సహపంక్తి భోజనం చేశారు. సొంత ఊరిలో గ్రామస్తులతో కాసేపు ముచ్చటించారు. పేర్లు పెట్టి పిలిచి బాగోగులు అడిగారు.