దేవరుప్పుల, నవంబర్ 30 : పాలకుర్తిలో మళ్లీ తానే గెలవబోతున్నానని, కాకుంటే అనుకున్నంత మెజారిటీ రాదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండల కేంద్రంలోని సర్పంచ్ రమాదేవి ఇంటి ఆవరణలో గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. పాలకుర్తి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ది, ఇంటింటికీ అందిన సంక్షేమ ఫలాలు తనకు భారీ మెజారిటీ ఇస్తాయని భావించినా, అందుకు తగ్గ మెజారిటీ రాదన్నారు.
బీఆర్ఎస్లో ఉన్న కొందరు నాయకులు పార్టీ మారడంతో కొంత నష్టం జరిగిందని, ప్రజలు తన వెంట ఉండడంతోనే విజయం సాధిస్తున్నానని ఎర్రబెల్లి తెలిపారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధితోపాటు తనను నమ్ముకున్న కార్యకర్తలకు సేవ చేసేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటానన్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలకు ఓటర్లు కొందరు అటువైపు మొగ్గు చూపడంతో మెజారిటీ తగ్గుతుందన్నారు.