తొర్రూరు, ఆగస్టు 23: ఎన్నికలు వస్తున్నాయని ప్రజల్ని గోల్మాల్ చేద్దామని కాంగ్రెస్ తుపాకీ వెంకట్రాముడి మాటలు చెబుతూ గారడీ చేయాలని చూస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. దివ్యాంగులకు ప్రభుత్వం అదనంగా రూ. వెయ్యి పెన్షన్ను పెంచుతూ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించిన ఉత్తర్వులను బుధవారం తొర్రూరు, పెద్దవంగర, రాయపర్తి మండలాల లబ్ధిదారులకు తొర్రూరులో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ కే శశాంకతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు లేవన్నారు. అధికా రంలోకి వస్తే రూ.4వేల పెన్షన్ ఇస్తామని చెబుతున్న కాంగ్రెస్ ఇప్పుడు దేశంలో అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలం రూ.200 పెన్షన్ ఇచ్చారని, కర్ణాటకలో రూ. 2 వేలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు 75శాతం వైకల్యం ఉన్న వారికి మాత్రమే రూ.630 ఇస్తున్నారని, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రూ.350 పెన్షన్ అందిస్తున్నారని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వరాష్ట్రమైన గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం రూ. వెయ్యి పెన్షన్ను మాత్రమే ఇస్తోందని చెప్పారు. రాష్ట్రంలో 40 శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులకు కూడా రూ.4016 పెన్షన్ ఇస్తున్నామని, ప్రజలు దీన్ని గమనించాలన్నారు. మహబూబాబాద్ జిల్లాలో 15,633 మంది దివ్యాంగులకు ప్రతి నెలా రూ.6కోట్ల 27లక్షల 82 వేల పెన్షన్ను ప్రతి నెల ప్రభుత్వం ఇస్తోందన్నారు. మరో 15 రోజుల్లో నూతన పెన్షన్ల జారీకి కసరత్తు చేస్తున్నామని, అర్హత ఉండి పెన్షన్లు రాని వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. త్వరలోనే ఆసరా పింఛన్లను కూడా పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ యోచిస్తున్నారని, లబ్ధిదారులు త్వరలో తీపికబురు వినే అవకాశం ఉందన్నారు. సకల జనుల ఆరాధ్యుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు ఇక్కడ అమలు చేస్తున్నారని తెలిపారు.
ఆలయ భూముల్లో 100 పడకల దవాఖాన
తొర్రూరు మున్సిపాలిటీలోని ముఖ్యమంత్రి కేసీఆర్ వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. అన్నారం రహదారిలోని దేవాలయ భూముల్లో పరిశీలన చేస్తున్నట్లు చెప్పారు. గృహలక్ష్మి లబ్ధిదారుల ఎంపికను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. ఎర్రబెల్లి దయాకర్రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులు అందించిన ఆర్థిక సహకారంతో కరోనా కష్టకాలంలో ప్రజలకు నిత్యావసర సరుకులు, ఆనందయ్య మందు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, సిలిండర్లు, మాస్కులు అందజేశానని వివరించారు. ప్రభుత్వ కొలువుల సాధనకు ఉచిత శిక్షణ, రూ.4కోట్లు వెచ్చించి నియోజకవర్గంలో 20 వేల మందికి డ్రైవింగ్ లైసెన్స్లు, రూ.5 కోట్లతో మహిళలకు ఉచిత కుట్టుశిక్షణ, కుట్టు మిషన్లను అందించినట్లు చెప్పారు. నియోజకవర్గంలో 79వేల మంది కూలీలకు ఉపాధి కిట్లు, రూ.కోటీ 20 లక్షల నిధులతో దివ్యాంగులకు స్కూటీల పంపిణీ చేశామన్నారు.
కొంత మంది స్కూటీలను అమ్ముకోవాలని ప్రయత్నించారని, దివ్యాంగులకు సహకారంగా ఉండే మోపెడ్ చక్రాలను తొలగించి దర్జాగా తిరుగుతు న్నారని, ఇలాంటి వారిపై చట్టపరంగా కేసులు పెట్టిస్తామని హెచ్చరించారు. త్వరలోనే మరో విడుత వాహనాల పంపి ణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, తొర్రూరు, పెద్దవంగర ఎంపీపీలు చిన్న అంజయ్య, ఈదురి రాజేశ్వరి, జడ్పీటీసీలు మంగళపల్లి శ్రీనివాస్, శ్రీరాం జ్యోతిర్మయి, రాష్ట్ర ఈజీఎస్ డైరెక్టర్ ఎల్ వెంకటనారాయణగౌడ్, పీఏసీ ఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, పాలకుర్తి దేవస్థాన కమి టీ చైర్మన్ వీ రామచంద్రయ్యశర్మ, డీఆర్డీవో సన్యాసయ్య, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ పీ సోమేశ్వర్రావు, జిల్లా రైతుబంధు సభ్యుడు రామసహాయం కిశోర్రెడ్డి, అడిషనల్ డీఆర్డీవో సట్ల వెంకట్, ఆర్డీవో నరసింహ, వైస్ చైర్మన్ సురేందర్రెడ్డి, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.