కాశీబుగ్గ/వరంగల్, జూలై 25 : భారీ వర్షాల నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. గ్రేటర్ వరంగల్లోని 14వ డివిజన్ పరిధి ఎస్ఆర్నగర్ ఇటీవల కురిసిన వర్షాలకు నీటి మునిగిపోయింది. విషయం తెలిసన వెంటనే మంత్రి ఎర్రబెల్లితోపాటు మేయర్ గుండు సుధారాణి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య, గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషాలు కాలనీని క్షేత్ర స్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి దయాకర్రావు మాట్లాడుతూ అధికారులు వెంటనే స్పందించి, బాధితులకు పునరావాసం కల్పించి, ఎప్పటికప్పుడు సందర్శించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.
మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నందున నిత్యం పర్యవేక్షించాలని సూచించారు. ఎలాంటి సమస్య ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అలాగే, చిన్నవడ్డేపల్లి చెరువు, మధురానగర్ను మంత్రి సందర్శించి అక్కడి వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు తూర్పాటి సులోచన, గుండేటి నరేంద్రకుమార్, మాజీ కార్పొరేటర్ ఓని భాస్కర్, వరంగల్ పీఏసీఎస్ చైర్మన్ ఈట్యాల హరికృష్ణ, రైతు బంధు సమితి అధ్యక్షుడు బుద్దె శ్రీనివాస్, నాయకులు కేతిరి రాజశేఖర్, ముడుసు నరసింహ, పత్రి సుభాష్, గంధం గోవిందు, పత్రి రాజపోశాలు, పసులా మల్లయ్య, మచ్చర్ల స్టాలిన్, గండ్రాతి భాస్కర్, జంగం రాజు, ఈర్ల రాజేందర్, కార్పొరేషన్, రెవెన్యు అధికారులు పాల్గొన్నారు. అలాగే, పునరావాస కేంద్రంలో బాధితులకు ఉదయం, సాయంత్రం భోజనాలు అందించారు. అలాగే, హనుమకొండలోని జూపార్క్, న్యూశాయంపేట ప్రాంతాల్లో చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్తో కలిసి పర్యటించిన మంత్రి దయాకర్రావు వరద నీటి మళ్లింపునకు సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇల్లందలో..
వర్ధన్నపేట : భారీ వర్షాలకు మండలంలోని ఇల్లంద ఎస్సీ కాలనీలోని పేదల ఇండ్లకు వర్షపు నీరు చేరి ఇబ్బందులకు గురైన విషయం తెలుసుకొని స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్, కలెక్టర్ ప్రావీణ్య, ఇతర అధికారులతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సందర్శించారు. ఈ సందర్భంగా వర్షపు నీరు రాకుండా తీసుకోవాల్సిన చర్యలను గుర్తించి, పనుల కోసం ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. కాలనీలో చాలా మంది పేదల ఇండ్లు శిథిలావస్థకు చేరాయని, రానున్న రోజుల్లో కూడా ఇల్లంద గ్రామానికి గృహలక్ష్మి కింద ఎక్కువ సంఖ్యలో పక్కా గృహాలను మంజూరు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అవసరమైన తన కోటా నుంచి కూడా మరిన్ని ఇండ్లను మంజూరు చేయిస్తానని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలువాలని ఆయన కోరారు. కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో చేపట్టిన మిషన్ కాకతీయతో రాష్ట్ర వ్యాప్తంగా చెరువు కట్టలు బలంగా తయారయ్యాయని మంత్రి తెలిపారు. అందుకే భారీ వర్షాలకు చెరువుల్లోకి నీరు చేరినా ఒక్క కట్ట కూడా కోతకు గురికాలేదన్నారు. పేదలకు ఇబ్బందులు వచ్చిన సమయంలో స్థానిక ప్రజాప్రతినిధులు మందుండి సేవలందించాలని సూచించారు. లోతట్టుగా ఉండే ప్రతీ కాలనీ, వార్డులను గుర్తించాలని ఉన్నతస్థాయి అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. వచ్చే వర్షాలకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులకు రాకుండా చూసుకునేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే, ఎమ్మెల్యే అరూరి రమేశ్ కూడా పేదల ఇబ్బందులను గుర్తించి తన సొంత ఖర్చులతో నిత్యావసర వస్తువులను ఇబ్బందులలో ఉన్న కుటుంబాలకు అందించడం అభినందనీయమని మంత్రి అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య, ఆర్డీవో వాసుచంద్ర, ఎంపీపీ అప్పారావు, జడ్పీటీసీ భిక్షపతి పాల్గొన్నారు.
వరంగల్-ఖమ్మం రహదారి పరిశీలన
ఐనవోలు : భారీ వానకు వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి పైన వదర భారీ భారీ ప్రవాహిస్తుడడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. దీంతో విషయం తెలుసుకున్న పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులతో కలిసి వరద ఉధృతిని పరిశీలించారు. రాకపోకలకు ఇబ్బంది కలుకకుండా సురక్షితంగా ప్రయాణించేలా తీసుకోవాలని అధికారులను సూచించారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదే విధంగా వరద చేపలు పడ్డాయాని గ్రామస్తులు అడుగడంతో, గ్రామస్తులు సంతోషంగా పట్టిన చేపలను మంత్రి ఎర్రబెల్లికి, ఎమ్మెల్యే అరూరి చూపించారు.