దేవరుప్పుల, నవంబర్ 2: దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలంతా బీఆర్ఎస్కు అండగా ఉన్నారని, ఈ ఎన్నికల్లో విజయం ఖాయమైనా మెజార్టీపై దృష్టి పెట్టాలని పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండలంలోని కోలుకొండ, సింగరాజుపల్లి కేంద్రాలుగా గురువారం పార్టీ కార్యకర్తలతో ఆయన సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు దేవరుప్పుల మండలంలో సాగు, తాగునీరు లేక ప్రజలు నానా ఇబ్బందులుపడ్డారని, రైతులు, కూలీలు ఉపాధి కోసం వలసబాట పట్టారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ సహకారంతో మండలంలోని యశ్వంతాపూర్, కోలుకొండ వాగులపై ఎనిమిది చెక్డ్యామ్లు నిర్మించడంతో సాగునీటి సమస్య పరిష్కారమైందన్నారు. 18 కిలోమీటర్ల మేర వాగు జీవనదిని తలపిస్తున్నదని ఎర్రబెల్లి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వివక్షకు గురికాగా, పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్నివర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. మరోవైపు దేవాదుల రిజర్వాయర్ల ద్వారా అన్ని చెరువులు నింపుతున్నామని, రెండు పంటలకు సాగునీరు అందుతున్నదని వివరించారు.
ఈ ఎన్నికల్లో మన విజయం ఖాయమైనప్పటికీ ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి మెజార్టీ పెంచేలా కృషి చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మనం చేసిన పనులు ర్చబండ వద్ద చర్చకు పెట్టాలని, మనం అందించిన సంక్షేమ ఫలాలు లబ్ధిదారులకు గుర్తుకు చేయాలన్నారు. దేవరుప్పుల మండలాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపాను, ఓట్లడిగే హక్కు మనకే ఉందన్నారు. అడ్రస్ లేని కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికలు రావడంతో ప్రజల వద్దకు వస్తున్నందున ప్రజలు ప్రశ్నించాలన్నారు. బూత్ లెవల్లో పనిచేస్తున్న నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ పార్టీకి, కారు గుర్తుకు ఓటేసేలా చూడాలన్నారు. ఈ 20 రోజులు మనకు కీలకమని, అనుక్షణం కార్యకర్తలు ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని ఎర్రబెల్లి కోరారు. మండల, గ్రామ స్థాయి నాయకుల సూచనలు పాటించాలన్నారు. ఇంకా అభివృద్ధి చేయాల్సిన పనులు ఉంటే దయన్న పక్షాన మీరే హామీ ఇవ్వండి.. పూర్తి చేసే బాధ్యతను తాను తీసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తీగల దయాకర్, మండల ఇన్చార్జి మనోహర్రావు, నాయకులు పల్లా సుందరరాంరెడ్డి, చామల విక్రంరెడ్డి, లింగాల రమేశ్ రెడ్డి, కత్తుల విజయ్కుమార్రెడ్డి, బస్వ మల్లేష్, ధరావత్ రాంసింగ్, కొల్లూరు సోమయ్య, చింత రవి, వంగ అర్జున్, కోతి ప్రవీణ్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.