జనగామ చౌరస్తా, జూలై 26 : పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్ఎన్ గార్డెన్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ధూప, దీప, నైవేద్య అర్చకుల ఆత్మీయ సమ్మేళనం ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు త్రిపురారి మనోహర్శర్మ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, విశిష్ట అతిథులుగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి, అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవశర్మ, వర్కింగ్ ప్రెసిడెంట్ పిండిపోలు నాగ దక్షిణమూర్తి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు తర్వాతే బ్రాహ్మణ పరిషత్ స్థాపించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వాలు బ్రాహ్మణ సమాజం కోసం చేసిందేమీ లేదన్నారు. బ్రాహ్మణులు లోక కల్యాణం కోసం పాటుపడుతారని పేర్కొన్నారు. దైవానికి, భక్తుడికి మధ్య అనుసంధానంగా పనిచేస్తారని పేర్కొన్నారు. సమాజంలో అందరి క్షేమం కోరే ‘కమ్యూనిటీ’గా బ్రాహ్మణులు ప్రత్యేక గుర్తింపు పొందినట్లు మంత్రి కొనియాడారు. బ్రాహ్మణుల సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్లో వివిధ పథకాల కింద ప్రభుత్వం రూ.232కోట్లు కేటాయించిందని చెప్పారు. ధూప, దీప, నైవేద్య పథకంలో భాగంగా రాష్ట్రంలోని 6,541 ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు వేతనాలను సీఎం కేసీఆర్ రూ.6వేల చొప్పున ఇచ్చారని, ఆ తర్వాత రూ.10వేలకు పెంచారని గుర్తుచేశారు. అర్చకుల అర్హత వయసును 65 ఏండ్లకు తగ్గించినట్లు వివరించారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ హైదరాబాద్లో 10 ఎకరాల్లో ‘బ్రాహ్మణ సదనం’ నిర్మించినట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో దేవాలయాల భూములు నిర్లక్ష్యానికి గురికాగా, అన్యాక్రాంతమైన భూములను కేసీఆర్ నేతృత్వంలో ఇప్పటివరకు 6 వేల ఎకరాలు కాపాడి, వాటి ద్వారా ఆలయాలకు ఆదాయం వచ్చేలా షాపింగ్ కాంప్లెక్స్లు, భవనాలు, కల్యాణ మండపాలు, పెట్రోల్ బంకులు నిర్మించినట్లు మంత్రి వివరించారు. నాడు దేవాలయాల నిర్మాణానికి దాతల విరాళాలకు మ్యాచింగ్ గ్రాంట్ కింద 30శాతం చెల్లించాల్సి వచ్చేదని, నేడు రాష్ట్ర ప్రభుత్వం దానిని 20శాతానికి తగ్గించిందని తెలిపారు. దేవాలయాల పునరుద్ధరణ నిధి రూ.10లక్షలకు పెంచినట్లు పేర్కొన్నారు. దేవాలయాల నిర్వహణకు ఏడాదికి రూ.10లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు.
స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ 14 దేవాలయాలకు 120 అభివృద్ధి పనులు మంజూరు చేసి రూ.107కోట్లు విడుదల చేసినట్లు వివరించారు. ఒక్కో దేవాలయ అభివృద్ధికి బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాలు నడుస్తున్న తరుణంలో పేదరికంలో మగ్గుతున్న బ్రాహ్మణ సమాజ అభ్యున్నతికి కేసీఆర్ కృషిచేస్తున్నారని అన్నారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా వంటి రాష్ర్టాల్లో బ్రాహ్మణుల జనాభా 10 నుంచి 14 శాతం ఉన్నా అక్కడ వారి గురించి పట్టించుకునే నాథుడే లేడని విమర్శించారు. దీనికి ప్రధాన కారణం నాయకుల మానసికస్థితి అని తెలిపారు. దాని ఫలితంగా బ్రాహ్మణ కులం తీవ్ర నిరాదరణకు గురువుతోందని మంత్రి ఎర్రబెల్లి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో దేవాలయాల అభివృద్ధి జరుగుతోందన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం, వేములవాడ రాజన్న, వరంగల్ భద్రకాళి, ఐనవోలు, కొమురవెల్లి మల్లన్న, పాలకుర్తి సోమన్న, వల్మిడి సీతారామచంద్ర స్వామి వంటి పురాతన దేవాలయాల పునరుద్ధరణ, జీర్ణోద్ధరణ జరుగుతోందని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. నాడు ధూప, దీప, నైవేద్యాలకు నోచుకోని గుడులు, గోపురాలు నేడు కళకళలాడుతున్నాయని మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ధూప, దీప, నైవేద్య ఆలయాలు మొత్తం 168 ఉండగా, ఇందులో వరంగల్ జిల్లాలో 20, హనుమకొండ 30, జయశంకర్ భూపాలపల్లి 33, మహబూబాబాద్ 30, ములుగు 13, జనగామ జిల్లాలో 42 ఆలయాలు ఉన్నట్లు మంత్రి ఎర్రబెల్లి వివరించారు. జిల్లాలో ఉన్న దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయని పేర్కొన్నారు. ఇంత చేసిన సీఎం కేసీఆర్ రుణం తీర్చుకునేలా బ్రాహ్మణ సమాజం మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని మంత్రి కోరారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ సమాజానికి అర్చకుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు.
అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవ్ శర్మ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కొలువై ఉన్న పురాతన దేవాలయాల్లోని దేవతామూర్తులకు గత ప్రభుత్వాలు రూ.1500 అర్చకుడికి, రూ.1000 పూజా సామగ్రికి ఇచ్చేదని, తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యాక సీఎం కేసీఆర్ ఆ మొత్తాన్ని రూ.6వేలు ఇస్తూ, ప్రస్తుతం రూ.10వేలకు పెంచడం హర్షణీయమన్నారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్యేతోపాటు జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డిని అర్చక సంఘం ఆధ్వర్యంలో వేద ఆశీర్వచనాలతో ఘనంగా సన్మానించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నావజ్జుల ప్రసాద్ శర్మ, కోశాధికారి నందనం హరికిషన్, కన్వీనర్ గోపి కృష్ణమాచార్యులు, సిద్ధాంతి సంపత్ కుమార్య కృష్ణమాచార్యులు, పాగాల మఠం సాయి శివప్రసాద్, మఠం చండీశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంబట్ల కరుణాకర్, త్రిపురారి ప్రభుదత్తు మౌర్య, బృంగి పరమేశ్వర్ పాల్గొన్నారు.