మిగ్జాం తుఫాన్ ప్రభావంతో అంతటా ముసురందుకుంది. సోమవారం అర్ధరాత్రి నుంచి చిరుజల్లులతో మొదలై మోస్తరు వాన కురుస్తుండడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వరి, మిర్చి, పత్తి పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం కురిసింది. చిరుజల్లులతో వాతావరణం చల్లాగా మారడంతో ప్రజలెవరూ బయటకు రావడం లేదు. దీంతో పలు గ్రామాల్లో రైతులు కోసిన వరి మెదలు తడిసిపోయాయి. వర్షానికి వడ్ల గింజలు రాలిపోయే ప్రమాదం కూడా ఉందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ముఖ్యంగా కోతల వేళ వరి నేలవాలి కంకులు తడువడం, కల్లాల్లో, మార్కెట్లో ఆరబోసిన ధాన్యం కుప్పలు తడిసి మద్దవడం అన్నదాతకు ఆందోళన కలిగిస్తున్నది. చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు పరదాలు, టార్పాలిన్లు షీట్లు కప్పుతూ జాగ్రత్త పడుతున్నాడు. గాలివానకు పలుచోట్ల మిర్చి మొక్కలు నేలవాలాయి. అలాగే పత్తి ఏరే సమయంలో వాన పడుతుండడంతో రంగు మారి నల్లబడుతుందని చెబుతున్నారు. వర్షంతో పొలాలు తడవడంతో వరికోత యంత్రాలు దిగబడే అవకాశం ఉండడంతో పనులకు అంతరాయం ఏర్పడింది. ఇలా అకాల వర్షం పంటలకు నష్టం కలిగిస్తూ రైతన్నను ఆగం చేస్తోంది.