హనుమకొండ చౌరస్తా, మే 12 : సీఎం కప్ క్రీడా పోటీల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో డిప్యూటీ కమిషనర్ జోనా అధ్యక్షతన హనుమకొండ, కాజీపేట మండలాలకు చెందిన సీఎం కప్ నిర్వహణ కమిటీ సభ్యులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆమె ముఖ్యఅతిథిగా హాజరై సమర్థవంతంగా నిర్వహించేందుకు తగు సూచనలు చేశారు.
మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా అన్ని మండలాలు, జిల్లాలతోపాటు రాష్ట్రస్థాయిలో విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించిందని తెలిపారు. అధికారులు, సిబ్బంది సమన్వయం, నిబద్ధతతో క్రీడాపోటీలు నిర్వహించాలని, మండలస్థాయి పోటీల నిర్వహణకు ఆయా గ్రామాల నుంచి ఎంట్రీలను ఆహ్వానించి అథ్లెటిక్స్, ఫుట్బాల్, వాలీబాల్, కబడ్డీ, ఖో-ఖో వంటి క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించాలని మేయర్ సూచించారు. ఇందుకోసం వివిధ ప్రచార మధ్యమాలు, సామాజిక మాధ్యమాల ద్వారా విసృ్తతప్రచారం కల్పించాలని, మండలస్థాయిలో అన్ని గ్రామాల జట్లు సూచించిన క్రీడల్లో పాల్గొనేలా చూడాలని అన్నారు.
జీడబ్ల్యూఎంసీ నుంచి క్రీడాకారులకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించాలని, ఈనెల 16 నుంచి 17 వరకు మండల స్థాయి, 22 నుంచి 24 వరకు జిల్లాస్థాయి, 28 నుంచి 31 వరకు రాష్ట్రస్థాయిలో క్రీడలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మేయర్ సుధారాణి క్రీడాకారులను కోరారు. సమావేశంలో ఇన్చార్జి డీవైఎస్వో శ్రీమన్నారాయణ, ఎంఈవో రామకృష్ణ రాజు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చెన్నకేశవులు, పీడీలు శ్రీధర్రావు, దస్రు, శానిటరీ ఇన్స్పెక్టర్లు రవీందర్, కరుణాకర్, అనిల్ పాల్గొన్నారు.