తాడ్వాయి, జనవరి 31 : మేడారంలో నేడు (బుధవారం) సమ్మక్క-సారక్క పూజారులు మండమెలిగే పండగ (మినీ జాతర)ను నిర్వహించనున్నారు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహాజాతర అనంతరం వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని మేడారంలో సమ్మక్క పూజారులు, కన్నెపల్లిలో సారక్క పూజారులు ఆయా పూజా మందిరాల్లో మండ మెలిగే పండగను నిర్వహించనున్నారు. ఈ పండుగను పురస్కరించుకొని పూజారులు ఆయా గ్రామాల్లో గ్రామదేవతలు, బొడ్రాయిల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం దుష్టశక్తులు గ్రామంలోకి రాకుండా పూజారులు బురుకు కట్టెలతో గ్రామ పొలిమేరలో మామిడి ఆకులతో పాటు కోడి పిల్లను కట్టి తోరణాలు కడతారు. పూజారులతో పాటు వారి కుటుంబ సభ్యులు, బంధువులు సమ్మక్క-సారలమ్మ పూజామందిరాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. మినీ జాతర ముగిసే వరకు అమ్మవార్లకు సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర క్రిష్ణయ్య, కన్నెపల్లిలో సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య అత్యంత నియమనిష్టలతో పూజలు నిర్వహించనున్నారు. ఆ రోజు (బుధవారం) రాత్రి తల్లుల పూజారులు రాత్రంతా గద్దెల వద్ద జాగారం చేసి ఒకరికి ఒకరు సాకను ఇచ్చిపుచ్చుకుంటారు. దీంతో మినీ జాతర ప్రారంభమవుతుంది. తల్లులను గద్దెల మీదకు తీసుకురావడం మినహా మహాజాతర సందర్భంగా అమ్మవార్లకు జరిగే పూజలు యథావిదిగా సాగుతాయి. బుధ, గురు, శుక్రవారాల్లో భక్తులు మొక్కులు చెల్లించుకున్న అనంతరం పూజా సామగ్రిని శుద్ధి చేసి గుడిలో భద్రపర్చడంతో మినీ జాతర ముగుస్తుంది.
భక్తులకు సకల సౌకర్యాలు
మేడారం జాతర నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2.82 కోట్లు మంజూరుచేయగా జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆధ్వర్యంలో అన్ని శాఖలు సకల సదుపాయాలు కల్పించే పనిలో నిమగ్నమయ్యాయి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం రూ.69.64 లక్షలు కేటాయించింది. 20 రోజలుగా భక్తులు తరలివస్తుండడంతో పారిశుధ్య పనులు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి నుంచి 200 మంది కూలీలను తీసుకువస్తున్నారు. నేటి నుంచి పనులు ప్రారంభించనున్నారు. జాతర పరిసరాల్లో ఉన్న 24 బ్లాక్ల మరుగుదొడ్ల నిర్వహణకు 48 మంది కూలీలను నియమించనున్నారు. అంతేకాకుండా నాలుగు విడిది గృహాలకు మరమ్మతులు చేసి భక్తులకు అందుబాటులో ఉంచారు. 50 మంది ఎంపీవోలు, 100 మంది పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వర్తించనున్నారు.
పుణ్యస్నానాలకు ఏర్పాట్లు
అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులు స్నానాలు చేసేందుకు ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో బ్యాటరీ ఆఫ్ట్యాప్స్ను ఏర్పాటు చేశారు. జంపన్నవాగుపై గల జంట వంతెనలకు ఒకవైపు రూ.11.70 లక్షలతో ఏర్పాట్లు పూర్తి చేశారు. స్నానఘట్టాలపై 350కి పైగా షవర్లను బిగించారు. భక్తులు దుస్తులు మార్చుకునేందుకు రేకులతో తాత్కాలిక గదులు ఏర్పాటు చేశారు. ఇన్ఫిల్టరేషన్ బావుల్లో పూడికతీత పనులు పూర్తయ్యాయి. చర్మ సమస్యలు తలెత్తకుండా బ్లీచింగ్ లిక్విడ్ను నీటిలో కలిపేందుకు ఏర్పాట్లు చేశారు.
దేవదాయశాఖ ఆధ్వర్యంలో..
సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దేవాదాయశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎండ నుంచి రక్షణ కల్పించేందుకు గద్దెలపై చలువ పందిళ్లు వేశారు. గద్దెల పరిసరాలు, సాలహారాన్ని విద్యుత్ కాంతులతో ఆకర్శణీయంగా తీర్చిదిద్దారు. గద్దెల పరిసరాల్లో మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకువచ్చారు. విధుల్లో ఉన్న అధికారులకు భోజన సదుపాయాలు కల్పించారు.
రూ.43 లక్షలతో విద్యుత్ పనులు
విద్యుత్ శాఖ సుమారు రూ.43 లక్షలతో విద్యుత్ మరమ్మతులు చేపట్టింది. నాలుగు రోజుల పాటు నిరంతరం కరంటు ఉండేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యుత్ అంతరాయం కలుగకుండా అవసరమైన చోట ట్రాన్స్ఫార్మర్లను బిగించారు. ప్రత్యామ్నాయంగా పస్రా, గోవిందరావుపేట, తాడ్వాయి నుంచి విద్యుత్ తీసుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
మిషన్ భగీరథ నీరు
జాతరకు వచ్చే భక్తులకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మిషన్ భగీరథ నీటిని అందించనున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే 18 ప్రాంతాలను గుర్తించి నల్లాను ఏర్పాటు చేశారు. 10 మినీ వాటర్ ట్యాక్లను సిద్ధం చేశారు. గద్దెల సమీపంలో స్టాల్స్ ఏర్పాటు చేసి భక్తులకు తాగునీరు సరఫరా చేయనున్నారు. పనులు పూర్తి కావడంతో మంగళవారం నుంచి నీటి సరఫరాను ప్రారంభించారు. మేడారం పరిసరాల్లో విడిది చేసే భక్తుల కోసం 110 చేతి పంపులకు మరమ్మతులు చేశారు. శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన నాలుగు సులభ్ కాంప్లెక్స్లను అందుబాటులోకి తీసుకువచ్చారు.
రూ.10 లక్షలతో వైద్యశాల ఏర్పాటు
భక్తులకు ఆరోగ్య సమస్యలు వస్తే వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు టీటీడి కల్యాణ మండపంలో ఉచిత వైద్యశాలను ఏర్పాటు చేశారు. రూ.10 లక్షల విలువైన వివిధ రకాల మందులతో పాటు 50 వేల మాస్కులు అందుబాటులో ఉంచారు. రోజుకు నలుగురు వైద్యాధికారులతో 10 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు.