తాడ్వాయి, ఫిబ్రవరి 4 : ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరైన మేడారం సమ్మక్క-సారలమ్మల మినీ జాతర సందర్భంగా ఆదివాసీ పూజారులు నేడు గుడిమెలిగే పండగకు వేళయ్యింది. వచ్చే బుధవారం మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని అమ్మవార్ల మినీజాతర నిర్వహించనున్న పూజారులు ముందు బుధవారం నాడు గుడిమెలిగే పండగను అంగరంగ వైభవంగా జరిపేందుకు సిద్ధమయ్యారు. మేడారంలోని సమ్మక్క దేవత పూజామందిరంలో సిద్దబోయిన వంశస్థులు, కన్నెపల్లిలోని సారలమ్మ పూజామందిరంలో కాక వంశీయులు పూజా కార్యక్రమాలు ప్రారంభించనున్నారు.
గుడిమెలిగే పండుగను పురస్కరించుకుని అత్యంత నియమ నిష్టలతో పూజారులు గుడిని నీటితో శుద్ధి చేసి అటవీ ప్రాంతంలోకి డోలివాయిద్యాల నడుమ పూజారులు, వారి కుటుంబ సభ్యులు వెళ్లి గుట్టగడ్డిని తీసుకొని వస్తారు. గడ్డికి పసుపు, కుంకుమలతో పూజలు చేసిన తర్వాత పూజామందిరాలపై గడ్డిని అలంకరిస్తారు. ఈ తంతుతో వనదేవతల మినీ జాతర ప్రారంభమైనట్లుగా పూజారులు భావిస్తారు. ఇప్పటినుంచి మినీ జాతర ముగిసే వరకు ప్రతి రోజు మందిరాల్లో పూజాకార్యక్రమాలతో పాటు రాత్రివేళల్లో డోలీలతో కొలుపు నిర్వహిస్తారు. 12న మండెమెలిగే పండగతో మినీజాతరలో భక్తులు మొక్కులు సమర్పించడం కోసం అధికసంఖ్యలో తరలివస్తారు. ఇప్పటికే ముందస్తు మొక్కులు చెల్లించేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో వస్తున్నారు.
మేడారం మినీ జాతర సమీపిస్తుండడంతో అమ్మవార్ల గద్దెలతో పాటు ఆలయం చుట్టూ ఉన్న సాలహారానికి దేవాదాయ శాఖ అధికారులు విద్యుత్ లైట్లతో అలంకరణ పనులను మంగళవారం ప్రారంభించారు. రాత్రివేళ దర్శించుకునే భక్తులకు అమ్మవార్ల గద్దెలు కనిపించేలా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు.
కొండాయి, దొడ్లలో మండమెలిగే..
ఏటూరునాగారం, ఫిబ్రవరి 4 : కొండాయిలో సారలమ్మ, గోవిందరాజులు, నాగులమ్మ జాతరను పురస్కరించుకుని బుధవారం మండమెలిగే పండుగను నిర్వహించేందుకు పూజారులు సిద్ధమయ్యారు. ఈ నెల 12 నుంచి కొండాయిలో జాతర నిర్వహించనున్నారు. ఏటా కొండాయి, దొడ్ల గ్రామాల్లో నిర్వహించే జాతర కోసం ఐటీడీఏ నుంచి నిధులు మంజూరు చేశారు. కాగా నేడు సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజుల గుళ్లను అందులోని పూజా సామగ్రి ఆడేరాలు, పడిగలు, బూరలు ఇతర సామగ్రిని శుద్ధి చేసి అలంకరిస్తారు. ఆలయ ఆవరణను ముగ్గులతో ప్రవేశ మార్గాల్లో మామిడి తోరణాలు కట్టి ముస్తాబు చేస్తారు. మండమెలిగే పండుగ సందర్భంగా ఆయా గ్రామాల్లోని ఆడబిడ్డలు తలంటూ స్నానాలు చేసి ముగ్గులు వేస్తారు. శుద్ధి చేసిన పూజా సామగ్రిని తిరిగి పసుపు, కుంకుమలతో అలంకరిస్తామని గోవిందరాజుల ప్రధాన పూజారి దబ్బగట్ల గోవర్దన్, సారలమ్మ పూజారి కాక వెంకటేశ్వర్లు, రాజారం, దబ్బగట్ల సదానందం తెలిపారు.
మినీ జాతరకు ప్రత్యేక బస్సులు
హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 4 : ఈ నెల 9 నుంచి 16వ తేదీ వరకు జరిగే మినీ మేడారం సమ్మక-సారలమ్మ వనదేవతల జాతరకు వరంగల్ రీజియన్ నుంచి ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయభాను తెలిపారు. మొత్తం 200 బస్సులు, 400 ట్రిప్పులు ప్రతిరోజు ప్రయాణికుల రద్దీకనుగుణంగా తిప్పనున్నట్లు చెప్పారు. హనుమకొండ బస్స్టేషన్ నుంచి మేడారానికి బస్సులు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమవుతాయన్నారు. అన్ని పల్లె వెలుగులు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహాలక్ష్మీ పథకం వర్తిస్తుందని, మహిళలు, ఆడపిల్లలు వారి ఆధార్కార్డు చూపించి ఫ్రీగా ప్రయాణం చేయొచ్చన్నా రు. హనుమకొండ బస్స్టేషన్, మేడారంలో ప్రతిరోజు ఇద్ద రు కంట్రోలర్లతో పాటు ఒక డిపో మేనేజర్ ఈ ప్రత్యేక బస్సుల ఆపరేషన్ పర్యవేక్షిస్తారన్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి వీటిని 24 గంటలు నడిపిస్తామని, వివరాలకు 9959226056 నంబర్లో సంప్రదించాలన్నారు.