వరంగల్ మహా నగర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు మేయర్ గుండు సుధారాణి తెలిపారు. సోమవారం గ్రేటర్ కార్పొరేషన్ కార్యాలయంలో బల్దియా సర్వసభ్య సమావేశం మేయర్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ప్రజా సమస్యలపై సుదీర్ఘ చర్చ సాగింది. 8 ఎజెండా అంశాలకు కౌన్సిల్ ఆమోద ముద్ర వేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రెండేళ్లలో రూ. 895 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ముంపు నివారణకు వేగంగా చర్యలు తీసుకుంటున్నామని, తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.10 కోట్లతో పనులు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
వరంగల్, మే 15 : నగర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా వరంగల్ మహా నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం సాగిం ది. సోమవారం మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన సుమారు 2 గంటల పాటు సాగిన కౌన్సిల్ సమావేశంలో సమావేశంలో ప్రజా సమస్యలపై సమగ్రంగా చర్చించారు. రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మేయర్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. రెండేళ్లలో నగరాభివృద్ధి కోసం రూ.895 కోట్లతో పనులు చేపట్టామన్నారు. తాగునీటి సమస్యను అధిగమించేందుకు పైపులైన్ లీకేజీలకు మరమ్మతులు, పైపులైన్ల మా ర్పు, నగరంలోని 51 కాలనీలలో తాగునీటి సరఫరా కోసం రూ.10 కోట్లతో పనులు చేపడుతున్నామని చెప్పారు. రూ.150 కోట్లతో చేపట్టిన వరద కాల్వ లు, కల్వర్టు నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. సమావేశంలో నగర ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను కార్పొరేటర్లు ప్రస్తావించారు. దీనిపై స్పందించిన మేయర్ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
సమస్యలపై గళమెత్తిన కార్పొరేటర్లు..తాగునీటి సమస్యలపై కార్పొరేటర్లు గళమెత్తారు. తాగునీటి సరఫరా, పైప్లైన్ల లీకేజీ సమస్యలను వివరించారు. మిషన్ భగీరథ పనులను అసంపూర్తిగా చేయడంతో క్షేత్రస్థాయిలో ప్రజలు ఇ బ్బందులు పడుతున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు. కాగా, మిషన్ భగీరథ పనులు చేస్తున్న పబ్లిక్ హెల్త్ అధికారులు సమావేశానికి డుమ్మా కొట్టడంపై మేయ ర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డివిజన్లో రోజు 14 ట్రాక్టర్ల చెత్త రోడ్లపై పడుతోందని, కేవలం 2 ట్రాక్టర్లు కేటాయించడం తో పూర్తిగా తొలగించలేక పోతున్నారని 7వ డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. పట్టణప్రగతిలో రూ.5 లక్షల నామినేషన్ పనుల పురోగతి ఆశించిన మేరకు సాగడం లేదన్నారు. 40వ డివిజన్లోని శ్మశానవాటిక అధ్వానంగా ఉందని కా ర్పొరేటర్ మరుపల్ల రవి కౌన్సిల్లో ప్ర స్తావించారు. ఉర్సు చెరువులో గుర్రపు డెక్కను తొలగించడం లేదని తెలిపారు. నోటరీ ద్వారా కొనుగో లు చేసిన ఇళ్లకు నంబర్లు కేటాయించాలని, కార్పొరేషన్కు చెందిన స్వర్గరథాలకు మైక్ సెట్లను ఏర్పాటు చేయాలని కోరారు. వీధి కుక్కల దాడిలో గాయపడిన పేదలకు ఆర్థికసాయం అందజేయాలన్నారు.
సమావేశంలో 8 ఎజెండా అంశాలకు కౌన్సిల్ సమావేశం ఆమోదం తెలిపింది. మే డే కానుకగా పారిశుధ్య కార్మికులకు వెయ్యి రూపాయల వేతనం పెంపును గ్రేటర్లోని 452 మంది కార్మికులకు వర్తింపజేయాలని తీర్మానించారు. ఇండోర్ స్టేడియంలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న బ్యాడ్మింటన్ కోచ్ ఎం శ్రీధర్ పదవీ కాలం మరో ఏడాది పొడిగించారు. జూడో కోచ్గా జన్ను సునీత ను నియమించేందుకు కౌన్సిల్ ఆమోద ముద్ర వేసింది. 3వ డివిజన్ పరిధిలోని ఆరెపల్లిలోని ప్రతిమ క్యాన్స ర్ దవాఖాన నుంచి తురక చెరువు వర కు మున్సిపల్ జనరల్ ఫండ్ రూ.1.50 కోట్లతో సీసీ బాక్స్ డ్రెయిన్ నిర్మించాలని కౌన్సిల్ నిర్ణయించింది. గ్రేటర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో 15 ఆర్థిక సం ఘం నిధులు రూ.3.85 కోట్లతో పాత పైన్లైన్లను తొలగించి కొత్తవి వేసేందుకు పరిపాలనా అనుమతులు తీసుకోనున్నట్లు కౌన్సిల్ తెలిపింది. అలాగే 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.2.57 కోట్లతో చేపట్టనున్న డ్యామేజ్ అయిన ఫీడర్ మెయిన్స్, ట్రంక్ మెయిన్స్ మార్చేందుకు కౌన్సిల్ ఆమోదించింది. కాకతీయ సప్తాహం వేడుకలకు అయిన ఖర్చు రూ.99.80లక్షలు చెల్లించేందుకు ఆమోద ముద్ర వేసింది. గ్రేటర్లో పాడైపోయిన స్లూయిన్ వాల్వ్లను మార్చేందుకు రూ.20.82లక్షలతో టెండర్లు పిలిచే అంశానికి ఆమోదం తెలిపింది.
బల్దియా సమావేశానికి ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. కేవలం ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాత్రమే సమావేశానికి వచ్చారు. 16 మంది కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు అరుణకుమారి, విజయలక్ష్మి, మనోహర్, మనీషా, గద్దెల బాబు, ఓని స్వర్ణలత, తేజస్వి, బాల్నే సురేశ్, సిద్ధం రాజు, పోశాల పద్మ, సర్తాజ్ బేగం, కవిత, జక్కుల రజిత, గుగులోత్ దివ్యరాణి, బీజేపీ కార్పొరేటర్లు జలగం అనిత, ఆడెపు స్వప్న హాజరుకాలేదు. కౌన్సిల్ సమావేశంలో వరంగల్ జిల్లా కలెక్టర్, ఇన్చార్జి కమిషనర్ ప్రావీణ్య, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, బల్దియా, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
బల్దియా సమావేశానికి 60వ డివిజన్ కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ ఆర్టీసీ బస్సులో వచ్చారు. తన సహచర కార్పొరేటర్లు సిరంగి సునీల్కుమార్, సంకు నర్సింగ్తో కలిసి ఆయన హనుమకొండ నుంచి ఆర్టీసీ బస్సులో వచ్చి ఎంజీఎం జంక్షన్లో దిగి కార్పొరేషన్ కార్యాలయం వరకు నడిచి వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలన్న సంకేతం ఇవ్వాలన్న ఉద్దేశంతో బస్లో వచ్చినట్లు అభినవ్భాస్కర్ తెలిపారు.
– గుండు సుధారాణి, మేయర్
నగరాభివృద్ధే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలన్న ధృడ సంకల్పంతో ముందుకు పోతున్నాం. రెండేళ్ల పాలనలో అనుకున్న దానికంటే ఎక్కువగా అభివృద్ధి చేశాం. పట్టణ ప్రగతి, సీఎం హమీ పథకం, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక నిధులు, స్మార్ట్సిటీ పథకం ద్వారా నగరంలో అనేక అభివృద్ధి పనులు పూర్తి చేశాం. రెండేళ్లలో గ్రేటర్లో రూ.895 కోట్లతో 4270 పనులను చేపట్టాం. వాటిలో 60 శాతం పనులను పూర్తి చేశాం. మిగతా వాటిని త్వరగా పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు, అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నాం. పార్టీలకతీతంగా 66 డివిజన్లలో సమాంతరంగా అభివృద్ధి పనులను చేపడుతున్నాం. తాగునీటి సరఫరాలో సమస్యలను అధిగమించేందుకు పైన్లైన్ల మార్పు, లీకేజీల సమస్యలను పరిష్కరించేందుకు రూ.10 కోట్లతో పనులు చేపడుతున్నాం. వచ్చే రెండు నెలల్లో అన్ని కాలనీలకు తాగునీరు అందిస్తాం. ముంపు నివారణకు రూ. 150 కోట్లతో చేపట్టిన వరద నీటి కాల్వలు, కల్వర్టుల నిర్మాణం వేగంగా సాగుతున్నది. మే చివరి నాటికి నగరంలోని 31 నాలాల పూడిక తీత పనులు పూర్తి చేస్తాం. కుక్కల బెడద నివారణకు నగరంలో మరో యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం.