వరంగల్, జూలై 26: నగరంలో ముంపు నివారణకు శాశ్వత చర్యలు తీసుకుంటున్నామని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. నగరంలో కురుస్తున్న కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాల పరిస్థితిని పరిశీలించేందుకు కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషాతో కలిసి మేయర్ బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. నిండుగా వరద శైపవహిస్తున్న బొందివాగును పరిశీలించారు. ప్రత్యేక సిబ్బందిని నియమించి ఎప్పటికప్పుడు నాలా పరిస్థితిని అంచనా వేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విలీన గ్రామం కొత్తపేటకు వెళ్లి శిథిలావస్థకు చేరిన బురుజును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సాకరాశికుంట, కీర్తిబార్, ఎన్టీఆర్ నగర్లలో వారు పర్యటించారు. అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మేయర్ మాట్లాడుతూ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో నగరంలో ఇప్పటికే ముంపు నివారణ పనులు జరుగుతున్నాయని, వరద నీరు రోడ్డెక్క కుండా సాఫీగా వెళ్లేలా డ్రైనేజీ నిర్మిస్తున్నట్లు తెలిపారు. నయీంనగర్ డక్ట్ నిర్మాణం పూర్తి కావడంతో హనుమకొండ ప్రాంతం ముంపు సమస్య పరిష్కారమైందని, శివనగర్లో డక్ట్ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో సుదీర్ఘకాలంగా ఉన్న ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని తెలిపారు.
ఎన్టీఆర్ నగర్లో..
గిర్మాజీపేట, జూలై 26: ముంపునకు గురైన ఎన్టీఆర్ నగర్కు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతామని మేయర్ గుండు సుధారాణి తెలిపారు. నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ మేరకు బుధవారం మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ షేక్రిజ్వాన్ బాషాతో కలిసి 33వ డివిజన్ పెరికవాడ, 28వ డివిజన్ ఎన్టీఆర్నగర్ కాలనీ, బృందావన్కాలనీ, సంతోషిమాతానగర్, సాయినగర్కాలనీల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఎన్టీఆర్నగర్ శాశ్వత పరిష్కారం కోసం బొందివాగు నాలా వద్ద ఫాలింగ్ షెట్టర్ల నిర్మాణానికి సీఎం కేసీఆర్, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారని, 30ఏండ్లుగా పరిష్కారం కాని సమస్యను త్వరలోనే పరిష్కరిస్తారని భరోసా ఇచ్చారు. 28వ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మర్రి రవీందర్, 33వ డివిజన్ బీఆర్ఎస్ నేత ముష్కమల్ల సుధాకర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అండర్ రైల్వేగేట్ ప్రాంతంలో..
కరీమాబాద్, జూలై 26: భారీ వర్షాలు కురుస్తున్నందున కాలనీల్లో నీరు నిలువకుండా చర్యలు చేపట్టాలని వరంగల్ మహా నగర పాలక సంస్థ మేయర్ సుధారాణి అధికారులకు సూచించారు. బుధవారం మేయర్ అండర్ రైల్వేగేట్ ప్రాంతంలోని పలు ప్రాంతాలను, నాలాను పరిశీలించారు. సాకరాశికుంట కాలనీల్లో 39వ డివిజన్లోని పలు సమస్యలను కార్పొరేటర్ సిద్దం రాజు మేయర్కు వివరించారు. నాలాలో చెత్తాచెదారం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నాలా, కాలువల్లో నీరు సక్రమంగా పారేలా చేయాలన్నారు.