బయ్యారం, జనవరి 2: అభయహస్తం ఆరు గ్యారెంటీల్లో రైతులకు అందించే రైతు భరోసా విషయంలో విధి విధానాలు ఏమిటి?, ప్రభుత్వం ఎలా భరోసా కల్పిస్తుందని పలువురు రైతులు సందేహం వ్యక్తం చేశారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలకేంద్రంలో ప్రజాపాలన గ్రామసభ నిర్వహించగా, పలువురు రైతులు తమ సందేహాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం విషయంలో అనేక సందేహాలు ఉన్నాయని, దరఖాస్తు ఎలా చేసుకోవాలో రైతులకు అర్థం కావడం లేదని రైతులు ఆర్ బుచ్చిరెడ్డి, నంబూరి మధు ప్రశ్నించారు.
పెట్టుబడి సాయం రూ.15వేలు యజమానికి ఇచ్చి, కౌలు చేస్తున్న రైతుకు కూడా ఇస్తా రా?, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు అందిస్తారా?, చిన్న, సన్నకారు రైతులు తమకున్న భూమితోపాటు మరికొంత భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తే అతడిని రైతుగా గుర్తించాలా?, లేక కౌలు రైతుగా గుర్తించాలా? రైతుబంధు సాయం అందేవారు.. రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలా వద్దా? అంటూ ప్రశ్నించారు. వారి సందేహాలను తహసీల్దార్ ఇమ్మాన్యుయేల్, ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి నివృత్తి చేసినా గందరగోళం నెలకొంది. కొంతమంది ప్రజలు దరఖా స్తు పత్రాలు అందక ఇబ్బంది పడ్డారు.