ఖిలావరంగల్/కరీమాబాద్, డిసెంబర్ 18: పాత కక్షలతో ఓ వ్యక్తిపై కత్తులతో దాడి చేశారు. అడ్డు వచ్చిన మరో యువకుడిని తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనలో గాయపడిన బాధితులను వరంగల్లోని ఎంజీఎం దవాఖానకు తరలించారు. శనివారం అర్ధరాత్రి శంభునిపేట జంక్షన్లో చోటు చేసుకున్న ఘటన వివరాలను మిల్స్కాలనీ ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాస్ విలేకరులకు తెలిపారు. బుడిగజంగాల కాలనీకి చెందిన తూర్పాటి హేమంత్ ఇదే ప్రాంతానికి చెందిన ప్రశాంత్తో క్రికెట్ విషయంలో ఇటీవల గొడవ జరిగింది. పెద్ద మనుషుల సమక్షంలో హేమంత్ది తప్పని చెప్పి క్షమాపణ చెప్పించారు.
అప్పటి నుంచి ప్రశాంత్పై కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి శంభునిపేట జంక్షన్లో పెండ్లి బరాత్ అనంతరం హేమంత్తోపాటు అతని స్నేహితులు ముగ్గురు కలిసి ప్రశాంత్పై విచక్షణ రహితంగా దాడి చేసి వెళ్లారు. అనంతరం ఘటనా స్థలానికి నిందితుడు కత్తితో వచ్చి ప్రశావంత్ను పొట్టలో పొడిచాడు. అడ్డువచ్చిన మరో యువకుడు అరుణ్కుమార్పై కూడా కత్తితో దాడి చేసి పారిపోయారు. రక్తం మడుగులో పడి ఉన్న క్షతగాత్రులను స్థానికులు ఎంజీఎం దవాఖానకు తరలించారు. బాధితుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఇదిలా ఉండగా నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఓ పోలీసు విభాగం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.