వరంగల్, జనవరి 23 : వ్యభిచారం ముసుగులో దోపిడీకి పాల్పడుతున్న ముగ్గురు మహిళలను మామునూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.8,400తో పాటు మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వరంగల్ ఈస్ట్రన్ డీసీపీ వెంకటలక్ష్మి సోమవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. పర్వతగిరి గ్రామానికి చెందిన రాయపురం సరిత, మహబూబాబాద్ జిల్లా కేసముద్రానికి చెందిన కోడం స్వరూప, నూనె స్వప్న, వరంగల్ జిల్లా కొత్తూరుకు చెందిన విజయ్కుమార్ సులభంగా డబ్బు సంపాదించాలని ముఠాగా ఏర్పడ్డారు. వీరు బస్స్టేషన్లలో మకాం వేసి అమాయకులను ప్రలోభ పెట్టి ప్రత్యేక వాహనం కిరాయికి తీసుకునే వారు. విటులను తీసుకుని నగర శివారు ప్రాంతాలకు వెళ్లేవారు. అదే సమయంలో ముగ్గురిలో ఓ మహిళ విజయ్కుమార్కు సమాచారం అందించేవారు.
ఈ క్రమంలో వీరు విటులను బెదిరించి డబ్బులు వసూలు చేసేవారని డీసీపీ వెంకటలక్ష్మి వివరించారు. ఈ ముఠాపై మామునూరు పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయని తెలిపారు. రూ. 20 వేల నగదు, రెండు సెల్ఫోన్లు దోపిడీకి గురయ్యాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీఐ క్రాంతికుమార్ సోమవారం తన సిబ్బందితో వెళ్లి ముగ్గురు మహిళా నిందితులను రాంగోపాలపురం వద్ద అరెస్ట్ చేసినట్లు తెలిపారు. విజయ్కుమార్ పరారీలో ఉన్నారని చెప్పారు. నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభచూపిన మామునూరు సీఐ నరేశ్కుమార్, క్రాంతికుమార్, ఎస్సై రాజేశ్రెడ్డి, కానిస్టేబుళ్లు సర్దార్పాషా, రాజును డీసీపీ అభినందించారు.