వర్ధన్నపేట, జనవరి 16: జిల్లాలో మల్లికార్జునస్వామి జాతరలు వైభవంగా జరిగాయి. సుప్రసిద్ధ చారిత్రక కట్య్రాలలో కనుమ సందర్భంగా ఏటా కరుమ, యాదవుల ఆధ్వర్యంలో మల్లికార్జునస్వామి జాతర నిర్వహిస్తారు. ఒగ్గుపూజారులు సోమవారం ఆలయం ఆవరణలోని మండపంలో ఒగ్గు పూజారులు పెద్దపట్నం వేసి ప్రత్యేక పూజలు చేశారు. జాతరకు కట్య్రాల, ఇల్లంద, ఉప్పరపల్లి, తదితర గ్రామాల రైతులు ఎడ్లబండ్లలో కుటుంబ సమేతంగా తరలివచ్చారు. ఎమ్మెల్యే అరూరి రమేశ్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, పలువురు ప్రముఖులు మల్లికార్జునస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
వారికి ఎంపీపీ అప్పారావు, మాజీ ఏఎంసీ చైర్మన్ గుజ్జ సంపత్రెడ్డి, ఆలయ కమిటీ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. కళాకారులతో కలిసి ఎమ్మెల్యే డోలుకొట్టి చిందేసి భక్తులు, కళాకారులను ఉత్సాహ పరిచారు. అనంతరం స్వామివారికి పూజలు చేశారు. పెద్దపట్నం వద్ద జరిగిన పూజలో ఎమ్మెల్యే, డీసీసీబీ చైర్మన్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ ప్రతినిధులు, సర్పంచ్ సంపత్రెడ్డి ఘనంగా సత్కరించారు. కాగా, కట్య్రాల దేవాలయ ఆవరణలో రూ.72లక్షల వ్యయంతో దేవాలయం చుట్టూ నిర్మించిన సీసీరోడ్డును ఎమ్మెల్యే రమేశ్, డీసీసీబీ చైర్మన్ రవీందర్రావు ప్రారంభించారు. ఆలయం నుంచి వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి వరకు ఉన్న మెటల్ రోడ్డుపై సీసీరోడ్డు వేసేందుకు ఇటీవల మంత్రి దయాకర్రావు రూ.80లక్షలు మంజూరు చేయగా ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కట్య్రాల, ఇల్లంద, కడారిగూడెం, ఉప్పరపల్లి తదితర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పర్వతగిరి: సంక్రాంతి సందర్భంగా మండలంలోని ప్రసిద్ధ గోపనపల్లి దూడెల మల్లికార్జునస్వామి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జాతరకు చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి దర్శించుకున్నారు. పట్నాలు వేసి మొక్కులు చెల్లించారు. మేడ సందర్శించారు. ఆలయ ప్రాంగణంలోని నవగ్రహాలకు, హనుమాన్ దేవాలయం, ఎల్లవ్వ తల్లి ఆలయాలను దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ బెల్లం బాలరాజు, సర్పంచ్ పంజా మహేశ్, డైరెక్టర్లు భక్తులకు అన్ని విధాల సౌకర్యాలను కల్పించారు. అర్చ కుడు భానుప్రకాశ్ నేతృత్వంలో స్వామివారికి ప్రత్యేక అలంకరణలు, ప్రత్యేక పూజలు చేశారు. యాదవుల కుల దైవమైన దూడెల మల్లికార్జునస్వామిని సంగెం, వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ముఖ్యఅతిథిగా రాగా గ్రామస్తులు కోలాటాలు, డప్పుచప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. ఆలయ చైర్మన్ బెల్లం బాలరాజు, డైరెక్టర్లు, ఎంపీపీ కమల, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్రావు, సింగ్లాల్, పీఏసీఎస్ చైర్మన్లు గొర్రె దేవేందర్, మనోజ్కుమార్గౌడ్, యాకాంతంగౌడ్, స్థానిక ఎంపీటీసీ సూర రమేశ్, ఉపసర్పంచ్ సూర అశోక్, అనంతారం సర్పంచ్లు పంజా మహేశ్, తౌటి దేవేందర్ పాల్గొన్నారు.
రాయపర్తి: పెర్కవేడు గ్రామంలో కొమురెల్లి మల్లన్న జాతర సోమవారం ఘనంగా జరిగింది. గ్రామంలోని దేవుని చెరువులో ఉన్న ఆలయంలో కొలువైన కొమురెల్లి మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీ. ఆలయ అనువంశిక పూజారులు నారంశెట్టి సాంబయ్య, కొమురుమల్లు, సత్యనారాయణ నేతృత్వంలో స్వామివారి లింగార్చనలు, అభిషేకాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శివసత్తులు, ఒగ్గు పూజారులు స్వామివారికి ఆలయ ప్రాంగణంలోని మర్రిచెట్టు వద్ద పసుపు, కుంకుమలు, బుక్కా గులాలు, తెల్లపిండి, తీరొక్క రంగులతో పట్నాలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలోని కులస్తులతోపాటు పలువర్గాల రైతులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, ఆటోలు, ట్రాలీలు, టాటా ఏస్లు, టాటా మ్యాజిక్లు, కార్లను ప్రభలుగా తయారు చేసుకుని స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ప్రభ బండ్లకు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహనాయక్, జిల్లా నాయకుడు బిల్ల సుధీర్రెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, సర్పంచ్ చిన్నాల తారాశ్రీ రాజబాబు, ఎంపీటీసీ బండి అనూష రాజబాబు, పార్టీ గ్రామ అధ్యక్షుడు బొమ్మెర వీరస్వామి, ఆకుల సమ్మయ్య, బండి కుమార్, బాషబోయిన సుధాకర్, కుల్లా వెంకన్న స్వాగతాలు పలికారు.
సంగెం: మండలంలోని ఆశాలపల్లి సమీప పర్వతాల మల్లికార్జున స్వామి చిన్న పట్నం ఆదివారం ఘనంగా జరిగింది. స్వామివారికి సుప్రభాత సేవ తర్వాత పంచామృత అభిషేకం, అన్నపూజ, కుంకుమార్చన కనులపండువగా జరిగింది. మామిడి తోరణాలను 1002 సకినాలు, రంగు రంగుల పుష్పాలతో అలంకరించారు. సాయంత్రం ఒగ్గు పూజారులు చిన్నపట్నం వేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ కూచన సమ్మయ్య, ప్రధాన పూజారులు కొడకండ్ల శ్రీకాంతాచార్యులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.