నగరాలు, పట్టణాల్లోని పబ్లిక్ టాయిలెట్ల పారిశుధ్య నిర్వహణ బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం అప్పగిస్తున్నది. వీటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచేందుకు అవసరమైన ఖర్చుల కోసం ఒక్కో సీటు(బేషన్)కు ప్రతి నెలా రూ.2500 చొప్పున చెల్లిస్తున్నది. సులభ్ కాంప్లెక్స్లో అన్ని వసతులు కల్పించిన తర్వాతే వాటి నిర్వహణ అప్పగించాలని నిర్ణయించింది. పట్టణ ప్రగతి నిధులతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 175 పబ్లిక్, మూడు కమ్యూనిటీ టాయిలెట్లు నిర్మించారు. రాష్ట్రంలోనే ప్రయోగాత్మకంగా థర్డ్ జెండర్లకు పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ అప్పగించి వారికి ఉపాధి కల్పించారు.
వరంగల్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నగరాలు, పట్టణాల్లోని ప్రజలకు మెరుగైన పారిశుధ్య నిర్వహణతో పబ్లిక్ టాయిలెట్ల(మరుగుదొడ్ల) వసతి కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. పబ్లిక్ టాయిలెట్ల పారిశుధ్య నిర్వహణ ప్రక్రియను పట్టణాల్లోని మహిళా స్వయం సహాయక సంఘాలు(ఎస్హెచ్జీ) అప్పగిస్తున్నది. టాయిలెట్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేందుకు అవసరమైన ఖర్చుల కోసం ఒక్కో సీటు(బేషన్)కు ప్రతి నెల రూ.2500 చొప్పున ఇస్తున్నది. అప్పు తీసుకోవడం, సకాలంలో చెల్లించడం చేసే మహిళా సంఘాలకు పారిశుధ్య నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తున్నది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా స్ట్రీట్ లెవల్, టౌన్ వెండర్ ఫెడరేషన్లకు కూడా టాయిలెట్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించవచ్చని అన్ని కార్పొనేషన్లు, మున్సిపాలిటీలకు తెలిపింది. పబ్లిక్, కమ్యూనిటీ, షీ-టాయిలెట్ల నిర్వహణ మెరుగ్గా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించింది. నిర్వహణ ఖర్చుల చెల్లింపులో ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వెయ్యి మందికి ఒకటి చొప్పున కొత్తగా కమ్యూనిటీ టాయిలెట్లను నిర్వహించాలని నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్లో 7200, రాష్ట్రంలోని మిగిలిన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో కలిపి 7683 టాయిలెట్ల నిర్మాణ ప్రక్రియను పూర్తి చేసింది.
మరుగుదొడ్ల కాంప్లెక్స్లో అన్ని వసతులు ఏర్పాటు చేసిన తర్వాతే వాటి నిర్వహణ అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తలుపులు, వాష్ బేషన్లు, కమోడ్, టాలిటెట్ కాంప్లెక్సులోకి వెళ్లేందుకు అవసరమైన మెట్లు, ర్యాంపు, వాటర్ ట్యాంకు, బోరు, సెప్టిక్ ట్యాంకు వసతి, కరెంటు కనెక్షన్, కేర్ టేకర్ డెస్క్ వంటి అన్ని వసతులు ఉండాలని సూచించింది. విద్యుత్ కనెక్షన్, నీటి సరఫరా కనెక్షన్తోపాటు ఈ చార్జీలను స్థానిక మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లే చెల్లించాలని స్పష్టం చేసింది. అవసరమైన నీటి సరఫరా లేకపోతే ట్యాంకర్లను ఏర్పాటు చేయాలని సూచించింది. కమ్యూనిటీ టాయిలెట్ల నిర్వహణ బాధ్యతలు తీసుకున్న సంఘాలు, సమాఖ్యలు పారిశుధ్య నిర్వహణలో పక్కగా వ్యవహరించాలని ఆదేశించింది. టాయిలెట్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేందుకు అవసరమైన సిబ్బందిని నియమించాలని సూచించింది. నిర్వహణ సంస్థ తరఫున కేర్టేకర్ ఉండాలని తెలిపింది. టాయిలెట్లను శుద్ధి చేసేందుకు అవసరమైన సరుకులను, వస్తువులను నిర్వహణ సంస్థలే సమకూర్చుకోవాలని పేర్కొంది. తలుపుల గొల్లాలు, నల్లాలు, బుగ్గలు, స్విచ్ఛులు వంటివి పని చేయకపోతే మార్చాలని సూచించింది. ఎక్కువ ఖర్చు అయ్యే వాటిని ఆయా పట్టణ పరిపాలన సంస్థలే భరించాల్సి ఉంటుందని తెలిపింది. పబ్లిక్ టాయిలెట్లను నిర్వహణకు అప్పగించే ముందు ఆ సంఘానికి లేదా సమాఖ్యకు స్థానిక మున్సిపాలిటీ కచ్చితంగా శిక్షణ ఇవ్వాలని పేర్కొంది.
గ్రేటర్ వరంగల్లో…
ప్రతి వెయ్యి మందికి ఒక సీటు చొప్పున జీడబ్ల్యూఎంసీ పరిధిలో పట్టణ ప్రగతి నిధులతో 1200 సీట్లు నిర్మించారు. నగర పరిశుభ్రతతో పాటు వీటి నిర్వహణతో మహిళా సంఘాలు, థర్డ్ జండర్, దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 175 పబ్లిక్ టాయిలెట్లు, మూడు కమ్యూనిటీ టాయిలెట్లు నిర్మించారు. 75 పబ్లిక్ టాయిలెట్లు, 1 కమ్యూనిటీ టాయిలెట్ నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగించారు. రాష్ట్రంలోనే ప్రయోగాత్మకంగా థర్డ్ జండర్లకు పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణను అప్పగించి వారికి ఉపాధి కల్పించారు. 7 పబ్లిక్ టాయిలెట్లు, ఒక కమ్యూనిటీ టాయిలెట్లను థర్డ్జండర్ గ్రూపులకు, 7 దివ్యాంగుల సంఘాలకు అప్పగించారు. పట్టణ ప్రగతి నిధులతో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ ఖర్చులను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ భరిస్తున్నది. ఒక్కో సీటుకు రూ.2500 చొప్పున వీరికి అందచేస్తున్నారు. మహిళా సంఘాలు, థర్డ్ జండర్, దివ్యాంగుల గ్రూపులు నిర్వహిస్తున్న పబ్లిక్ టాయిలెట్లకు ప్రతి ఏడాది కోటి రూపాయలు నిర్వహణ ఖర్చుల కింద జీడబ్ల్యూఎంసీ చెల్లిస్తున్నది. ఈ గ్రూపులు నిర్వహిస్తున్న పబ్లిక్ టాయిలెట్ల వద్ద వినియోగదారులు యూజర్ చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ-ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద సఫాయి కర్మచారి సంఘాలు, సులభ్ ఇంటర్నేషనల్, మోడ్రన్ శానిటేషన్ సంఘాలు పబ్లిక్ టాయిలెట్లను యూజర్ చార్జీలు వసూళ్లు చేస్తూ నిర్వహిస్తున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్వర్యంలో రెండు మొబైల్ పబ్లిక్ టాయిలెట్లు నగరంలో ప్రతి రోజు తిరుగుతున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, కలెక్టరేట్ కాంప్లెక్స్లో ప్రత్యేకంగా షీ టాయిలెట్లను నిర్మించారు.