మడికొండ, డిసెంబర్ 10 : మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల సీవోఈ కళాశాలలో గురుకులాల సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నుంచి 13 వరకు జోనల్ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించనున్నారు. కమ్యూనిటీ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్, ఎనర్జీ రీసోర్స్ అండ్ కన్జర్వేషన్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూ అండ్ కన్సర్న్స్, నేచురల్ రిసోర్స్ అండ్ దేర్ కన్జర్వేషన్, గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ అనే ఆరు అంశాలపై విద్యార్థులు తమ ఎగ్జిబిట్లను ప్రదర్శించనున్నారు. జోన్-2లోని కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్ధిపేట, సంగారెడ్డి, వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల నుంచి 60 గురుకులాల విద్యార్థులు ఇందులో పాల్గొననున్నారు. ఒక్కో గురుకులం నుంచి రెండు అంశాలతో నలుగురు చొప్పున మొత్తం 240 మంది విద్యార్థులు, 120 మంది గైడ్ టీచర్లు హాజరుకానున్నారు. ఈ ప్రదర్శనకు హాజరయ్యే బాలబాలికలకు వేర్వేరుగా క్యాంపస్ను ఏర్పాటు చేసి వసతి సౌకర్యం కల్పించనున్నారు. ఇప్పటికే తమ ఎగ్జిబిట్లతో విద్యార్థులు ప్రదర్శన కేంద్రానికి చేరుకున్నారు. రీజినల్ కోఆర్డినేటర్ విద్యారాణి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
సోమవారం నుంచి మూడు రోజుల పాటు జరుగనున్న జోనల్ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రదర్శనకు హాజరయ్యే బాల బాలికలకు ఇబ్బందులు తలెత్తకుండా వేర్వేరుగా వసతి కల్పించాం. విద్యార్థులు తమ నైపుణ్యాన్ని ఎగ్జిబిట్ల ద్వారా ప్రదర్శించనున్నారు. ప్రారంభోత్సవానికి పర్యావరణ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కలెక్టర్ సిక్తా పట్నాయక్, మేయర్ గుండు సుధారాణి తదితరులు హాజరుకానున్నారు.
– దాసరి ఉమామహేశ్వరి, గురుకులాల జిల్లా కోఆర్డినేటర్