నర్సింహులపేట, నవంబర్ 27 : రైతులు యాసంగిలో ఆరుతడి పంటల సాగు చేయాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. మండలంలోని బొజ్జన్నపేట, జయపురం గ్రామాల్లో కూరగాయాల సాగు, నర్సింహులపేట, పడమటిగూడెం, దుబ్బతండా, పెద్దనాగారం, వంతపడల గ్రామాల రైతులు యాసంగిలో వేరుశనగ, మొక్కజొన్న, పచ్చజొన్న, పెసర సాగు చేస్తున్నారు. వరికి బదులుగా ఆరుతడి పంటల సాగు వైపు రైతులు దృష్టి సారించారు. ఆరుతడి పంటల్లో పెట్టబడితో పాటు ఇతర ఖర్చులు తక్కువగా ఉండటంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు.
పెట్టుబడి ఖర్చులు తక్కువే..
పంట వేసినప్పటి నుంచి పూర్తయ్యే వరకు ఎరువుల తప్ప ఇతర ఖర్చులు తక్కువేనని రైతులు చెబుతున్నారు. ఆరుతడి పంటల్లో మందులు, కలుపు కోతలో ఖర్చులు ఉంటాయి. దిగుబడులు ఎక్కువగా రావడంతో లాభాం పొందవచ్చని అంటున్నారు. అలాగే పంట మార్పిడి చేయడం ద్వారా కూడా రైతులకు లాభాం చేకూరుతుందని అధికారులు సూచిస్తున్నారు.
10 ఏళ్లుగా వేరుశనగ సాగు చేస్తున్నా..
10 ఏళ్లుగా వేరుశనగ సాగు చేస్తున్నా.. ప్రతి సంవత్సరం అధిక దిగుబడులు వస్తున్నాయి. నాలుగు ఎకరాల్లో సాగు చేస్తున్నా. వానకాలంలో పెసర పంట వేశా.. ఇప్పుడు వేరుశనగ పండిస్తున్నా..
పాతురి మధురెడ్డి, రైతు, పడమటిగూడెం
పంట మార్పిడితో రైతులకు మేలు ..
రైతులు ఆరుతడి పంటల సాగుకు అసక్తి చూపుతున్నారు. బొజ్జన్నపేట శివారు బీమ్లాతండా, జయపురం గ్రామాల్లో కూరగాయలు, ఇతర గ్రామాల్లో వేరుశనగ సాగు చేస్తున్నారు. రైతులు నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలి. సాగు సమయంలో రైతులకు సలహాలు, సూచనలు అందిస్తాం. పంట మార్పిడితో రైతులకు మేలు చేకూరుతుంది. రామకృష్ణ, ఇన్చార్జి ఏవో