ఖానాపురం, నవంబర్ 27 : చెరువు నిండా నీరున్నా చివరి ఆయకట్టుకు నీరందించ లేని పాకాల పంట కాల్వల దుస్థితికి గత పాలకులే కారణమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని ధర్మారావుపేట, అశోక్నగర్ గ్రామాల్లో నిర్వహించిన ఆర్వోఎఫ్ఆర్ సభల్లో పాల్గొని మాట్లాడారు. పాకాల కాల్వలకు మరమ్మతుల పేరుతో అశాస్త్రీయంగా గోడలు నిర్మించి చివరి ఆయకట్టుకు నీరందకుండా చేసిన పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. పాకాలకు పూర్వవైభవం తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని చెప్పారు. ఇప్పటికే పాకాలకు గోదావరి జలాలను తీసుకువచ్చామన్నారు. అదేవిధంగా కాల్వల ఆధునీకరణకు ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారు. పాకాల ఆయకట్టు రైతులు రాష్ట్ర సాగు ప్రణాళికను అనుసరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. అందుకే యాసంగి పాకాల తైబందీని ముందుగానే ప్రకటించామని తెలిపారు. డిసెంబర్ 15వ తేదీ నుంచి నీటిని విడుదల చేసి ఏప్రిల్ 10 వరకు నిలిపివేస్తామని, అనంతరం 45 రోజుల పాటు కాల్వల ఆధునీకరణ పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. రైతులు సహకరించాలని కోరారు. సీఎం కేసీఆర్ పోడు రైతులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను ఇచ్చేందుకు సర్వేను చేయిస్తున్నారని తెలిపారు. దరఖాస్తు చేసుకోని వారికి రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి మరో అవకాశం కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. డిసెంబర్లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మహబుబాబాద్లో పోడుభూములకు పట్టాల పంపిణీ ఉంటుందని చెప్పారు. నర్సంపేట నియోజకవర్గంలోని పోడురైతుకే తొలిపట్టా ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపారు. అశోక్నగర్లో ముస్లింలకు పోడుభూములకు పట్టాలివ్వాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, డీటీడీవో జహీరొద్దీన్, తహసీల్దార్ జూలూరి సుభాషిణి, ఎంపీడీవో సుమనవాణి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, సర్పంచ్లు గొర్రె కవిత, వెన్ను శృతి, ధరావత్ సునీత, వైస్ ఎంపీపీ రామసహాయం ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.