నెల్లికుదురు, ఆగస్టు 26 : పిల్లలకు కుటుంబమే మొదటి బడి.. తల్లిదండ్రులే తొలి గురువులు.. వారి పాత్రే పిల్లల అభ్యాసానికి కీలకం. అందుకే తల్లిదండ్రులు అన్ని విద్యా కార్యకలాపాల్లో పాల్గొంటే ఇటు పిల్లలు, పాఠశాలలు బాగుంటాయనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పీటీఎం(పేరెంట్స్-టీచర్స్ మీటింగ్) నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతి తల్లిదండ్రిని భాగస్వామ్యం చేసి ప్రతి నెల మూడో శనివారం ఈ సమావేశాలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీచేసింది. ఫలితంగా సమస్యలు, అవసరాలతో పాటు విద్యార్థుల ప్రతిభ, ఇతర సామర్థ్యాలను తెలుసుకొని మెరుగుపెట్టేందుకు భవిష్యత్తులో మరింత తీర్చిదిద్దేందుకు దోహదపడనున్నది.
పిల్లల నమోదు, హాజరు, డ్రాపౌట్లు, పాఠశాల నిర్వహణ, పనితీరు, అభివృద్ధి కార్యకలాపాలపై హెచ్ఎం, ఉపాధ్యాయులతో వివిధ సమస్యలపై చర్చించడానికి రెండు నెలలకోసారి స్కూల్ మేనేజ్మెంట్(ఎస్ఎంసీ) సమావేశాలు నిర్వహిస్తారు. అయితే చాలామంది తల్లిదండ్రులు పాఠశాలల వ్యవహారాలను పెద్దగా పట్టించుకోరు. ఈ క్రమంలో వారి ప్రాతినిధ్యం విస్తృతం చేయడం, ప్రతి పేరెంట్ను భాగస్వామ్యం చేయడం, పాఠశాలల శ్రేయస్సు కోసం ప్రతి తల్లిదండ్రుల గొంతుక వినిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2022-23 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాలల నిర్వహణ కమిటీ(ఎస్ఎంసీ)తో పాటు తల్లిదండ్రుల ఉపాధ్యాయ సమావేశాలు(పీటీఎం)నిర్వహించాలని నిర్ణయించింది. ఈమేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
పాఠశాలల్లో అభివృద్ధి కార్యకలాపాలు, పాఠశాల నిర్వహణ, పనితీరు తదితర వాటిని హెచ్ఎం, ఉపాధ్యాయులతో చర్చించి సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పటికే ప్రతి రెండు నెలలకోసారి ఎస్ఎంసీ సమావేశాలను నిర్వహిస్తున్నది. ఈ కమిటీలో ప్రతి తరగతి నుంచి ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రమే ఉంటారు. ఇక నుంచి ప్రతి విద్యార్థి తల్లిదండ్రులను పాఠశాలల అభివృద్ధిలో భాగస్వామ్యా న్ని మరింత విస్తృతం చేయాలనే ప్రధాన లక్ష్యంతో సర్కారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి నెల మూడో శనివారం తప్పనిసరిగా పేరెంట్స్-టీచర్ సమావేశాలు(పీటీఎం) నిర్వహించాలని నిర్ణయించింది.
పీటీఎం నిర్వహించడం ఇలా..
ప్రతి నెల మూడో శనివారం విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించాలి.
ఒకవేళ మూడో శనివారం సెలవు దినం అయితే 4వ శనివారం నిర్వహించాలి.
ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఒక ఆహ్వాన పత్రం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులను సమావేశాలకు ఆహ్వానించాలి.
ప్రతి తరగతిలో విద్యార్థుల ప్రగతిని, వివిధ రంగాల్లో వారు కనబర్చిన సామర్థ్యాలను తల్లిదండ్రులకు తెలియజేయాలి.
చర్చించే అంశాలివి..
విద్య, సాంస్కృతికపరమైన అంశాల్లో విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు తెలియజేయాలి.
ప్రాథమిక పాఠశాలలో ‘తొలిమెట్టు’ అమలుపై అవగాహన కల్పించాలి.
మన ఊరు-మన బడి/మన బస్తీ-మన బడి, ఆంగ్ల మాధ్యమ బోధనపై అవగాహన కల్పించాలి.
విద్యార్థుల హాజరు పెంపు కోసం తీసుకునే చర్యలపై చర్చ నిర్వహించాలి.
విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యంపై తల్లిదండ్రులతో చర్చించాలి.
పాఠశాల ప్రగతి కోసం తగు సలహాలు, సూచనలు తీసుకోవాలి.
మధ్యాహ్న భోజన అమలుపై చర్చ జరుపాలి.
విద్యార్థులు ఇంటి వద్ద అభ్యసనం చేసేందుకు తల్లిదండ్రుల సహకారం తీసుకోవాలి.
సమావేశం రోజు నో బ్యాగ్ డే, బాలసభ వంటి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి.
విద్యార్థులకు ప్రభుత్వం అందించే సదుపాయాలు, అవకాశాలు, స్కాలర్షిప్ల వంటి విషయాలను వారికి తెలియజేయాలి.
ప్రధానోపాధ్యాయుల బాధ్యతలు
ప్రధానోపాధ్యాయుడు గ్రామ సర్పంచ్, ఎస్ఎంసీ చైర్మన్, ఎస్ఎంసీ సభ్యులు, ఉపాధ్యాయులు, స్వయం సహాయక సంఘాల సభ్యులతో ముందుగా సమావేశమై పీటీఎం సమావేశాలపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలి.
సమావేశానికి విద్యార్థుల తల్లిదండ్రులు 100 మంది హాజరయ్యేందుకు స్వయం సహాయక సంఘాల సభ్యుల సహకారం తీసుకోవాలి.
ప్రభుత్వం నిర్దేశించిన నెలవారీ అజెండా ప్రకారం ఆ అంశాలపై చర్చ జరిపేలా తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించాలి.
ప్రతి సమావేశంలో చేసిన తీర్మానాలను ఓ రిజిస్టర్లో నమోదు చేయాలి. వాటిపై తదుపరి సమావేశంలో సమీక్షించాలి.
ఉపాధ్యాయులు ఏం చేయాలంటే..
ఉపాధ్యాయులు విద్యార్థుల బలాలు, బలహీనతలు తరగతి వారీగా, విషయాల వారీగా గుర్తించి ప్రొఫైల్స్ తయారు చేయాలి.
విద్యార్థుల ప్రగతిని తెలుపుతూ పాఠశాలలో నిర్వహించే వివిధ రకాల పోటీ పరీక్షలు, ఇన్స్పైర్, ఎన్ఎంఎంఎస్, ఎన్టీఎస్ఈ, ఒలింపియాడ్స్, ఆన్లైన్ క్విజ్లు వంటి వాటి గురించి తెలియజేయాలి.
విద్యార్థుల విద్యాపరమైన, సాంస్కృతికపరమైన, ఆరోగ్యపరమైన, మానసిక స్థితిగతులపైన, అభిరుచులు, వైఖరులు, అలవాట్లు మొదలైన వాటి గురించి చర్చ జరుపాలి.
విద్యార్థుల అభ్యసన మెరుగుదలకు తల్లిదండ్రుల సలహాలు, సూచనలు తీసుకొని వాటిపై చర్చించాలి.
అధికారుల బాధ్యతలు
అధికారులు నిరంతరం పాఠశాలలను పర్యవేక్షిస్తూ తల్లిదండ్రుల సమావేశాలు కొన్నింటికి ప్రత్యక్షంగా హాజరుకావాలి.
డీఆర్డీవో, మెప్మా, ఎస్హెచ్జీ వంటి వారి సహకారంతో సమావేశాలను విజయవంతం చేసేలా చర్యలు తీసుకోవాలి.
ప్రభుత్వం విద్యా సంవత్సరం మొత్తానికి నెలవారీగా నిర్దేశించిన అంశాలపై తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించాలి.
అందరి భాగస్వామ్యం ఉండాలి..
విజ్ఞానాన్ని అందించి బంగారు భవిష్యత్కు దారి చూపే పాఠశాలల్లో అందరి భాగస్వామ్యం ఉంటే ఆ పాఠశాల అభివృద్ధి చెందుతుంది. పాఠశాల యాజమాన్య కమిటీతో ఇప్పటివరకు కొంతమంది తల్లిదండ్రులే భాగస్వామ్యులయ్యేవారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పీటీఎంలతో అందరు తల్లిదండ్రుల భాగస్వామ్యం ఉంటుంది. ఇది వినూత్నమైన కార్యక్రమం. నేడు అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్లు నిర్వహించాలి. సమావేశ నిర్వహణలో మినిట్ బుక్ తప్పనిసరిగా నిర్వహించాలి. సమావేశానికి హాజరైన తల్లిదండ్రుల వివరాలను సీఆర్పీల ద్వారా ఎమ్మార్సీకి అందించాలి. తద్వారా జిల్లా కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది.
– గుగులోత్ రాము, ఎంఈవో, నెల్లికుదురు
హెచ్ఎంలు ప్రతి నెల పీటీఎం నిర్వహించాలి
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు విధిగా ప్రతి నెల మూడో శనివారం పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ నిర్వహించాలి. మూడో శనివారం సెలవు దినం అయితే నాలుగో శనివారం సమావేశం నిర్వహించాలి. సమావేశ వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రులను భాగస్వాములను చేసేందుకు ప్రభ్వుత్వ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ సమావేశాల నిర్వహణలో హెచ్ఎం, ఉపాధ్యాయులు ఎలాంటి అలసత్వం వహించొద్దు.
– అబ్దుల్ హై, డీఈవో, మహబూబాబాద్