మహబూబాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి వరంగల్ జిల్లాలో మానుకోట అత్యధిక మండలాలు కలిగిన జిల్లాగా మానుకోట మారింది. 16 మండలాలతో ఇంతకు ముందు కూడా టాప్ ప్లేస్లో ఉండగా, రాష్ట్ర సర్కారు ఇటీవల జిల్లాలో సీరోలు, ఇనుగుర్తి మేజర్ గ్రామ పంచాయతీలను మండలాలు ప్రకటించడంతో వీటి సంఖ్య 18కి చేరింది. హనుమకొండ జిల్లాలో 12 మండలాలు, వరంగల్ జిల్లాలో 13 మండలాలు, జనగామ జిల్లాలో 12 మండలాలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 11, ములుగు జిల్లాలో 9 మండలాలు ఉన్నాయి. సీరోలు, ఇనుగుర్తి మేజర్ గ్రామ పంచాయతీలను మండలాలుగా ప్రకటించాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నా, ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక, సీఎం కేసీఆర్ 2016 నుంచి వరుసగా కొత్తగా జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారు. అప్పుడు జిల్లాలో కొత్తగా మండలాలు చేసుకున్నప్పటికీ ఇనుగుర్తి, సీరోలు మాత్రం మండలాలు కాలేదు. 2018 ఎన్నికల ప్రచారంలో, 2019 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ ఈ రెండు ప్రాంతాలను మండలాలు చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సీరోలు, ఇనుగుర్తిని మండలాలుగా ప్రకటించారు. ఒకే సారి రెండు మండలాలను ప్రకటించడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 461 గ్రామ పంచాయతీలుండా, వీటిలో 288 రెవెన్యూ గ్రామాలున్నాయి. కుటుంబాల సంఖ్య 1,95,889 కాగా, జనాభా 7,74,549 మంది ఉన్నారు. ఇందులో ఎస్టీ జనాభా 2,92,828, ఎస్సీ జనాభా 1,04,508 మంది కాగా, మిగిలిన వారు 3,77,213 మంది ఉన్నారు. కాగా, ప్రస్తుతం జిల్లాలో మహబూబాబాద్, కురవి, కేసముద్రం, డోర్నకల్, గూడూరు, కొత్తగూడ, గంగారం, బయ్యారం, గార్ల, చిన్నగూడూరు, దంతాలపల్లి, తొర్రూరు, పెద్దవంగర, నెల్లికుదురు, మరిపెడ, నర్సింహులపేట మండలాలుండగా, కొత్తగా సీరోలు, ఇనుగుర్తిని రాష్ట్ర సర్కారు మండలాలుగా ప్రకటించింది.
మండలాల వారీగా జనాభా..
2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో మొత్తం 7,74,549 మంది జనాభా ఉన్నారు. మండలాల వారీగా పరిశీలిస్తే ..మహబూబాబాద్ మండలంలో 1,13,812మంది, కురవి మండలంలో 67,179, కేసముద్రం మండలంలో 66,041, డోర్నకల్ మండలంలో 55,428, గూడూరు మండలంలో 55,781, కొత్తగూడ మండలంలో 28,796, గంగారం మండలంలో 10,780, బయ్యారం మండలంలో 42,587, గార్ల మండలంలో 36,998, చిన్నగూడూరు మండలంలో 15,317, దంతాలపల్లి మండలంలో 30,276, తొర్రూరు మండలంలో 68,400, పెద్దవంగర మండలంలో 27,823, నెల్లికుదురు మండలంలో 56,476, మరిపెడ మండలంలో 70,036, నర్సింహులపేట మండలంలో 28,819 మంది జనాభా ఉన్నారు.