నెల్లికుదురు, జూలై 28: చిన్నారుల భవితకు ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్రమాన్ని చేపడుతున్నది. పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలు పెంచడమే లక్ష్యంగా దీన్ని అమలు చేయనున్నది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ధారాళంగా చదవడం, తప్పుల్లేకుండా రాయడం, గణితంలో కనీస విద్యా ప్రమాణాలు పెంచడం వంటివి చేయనున్నది. ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 15 నుంచి ప్రారంభించేందుకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 7035 మంది రిసోర్స్ పర్సన్లకు శిక్షణనిస్తోంది.
నేషనల్ అచీవ్మెంట్ సర్వే-21(న్యాస్) ఆధారంగా ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి విద్యార్థుల్లో ఆశించిన స్థాయిలో విద్యా ప్రమాణాలు లేవనేది వెల్లడైంది. దీంతో వారిలో సామర్థ్యాలను పెంచేందుకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 15 నుంచి తొలిమెట్టు కార్యక్రమాన్ని అమ లు చేయనున్నది. ఇందుకోసం రిసోర్స్ పర్సన్లు, టీచర్లకు శిక్షణ ఇస్తున్నది. విద్యార్థులు తడబడ కుండా చదవడం, తప్పుల్లేకుండా రాయడం, గణిత సామర్థ్యాలను పెం పొందించడం వంటి లక్ష్యాలతో ఈ కా ర్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. పిల్లల్లో సబ్జె క్టు పరంగా బోధనతోపాటు అభ్యసనా సామర్థ్యాలను సాధించేందుకు ఇది దోహదపడనుంది.
రిసోర్స్ పర్సన్లకు కొనసాగుతున్న శిక్షణ..
పాఠశాల విద్యాశాఖ, రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణ మండలి(ఎస్సీఈఆర్టీ) సంయుక్తంగా ఇప్పటికే జిల్లాల నుంచి రిసోర్స్ పర్సన్లను ఎంపిక చేసింది. వీరికి ఈ నెల 19 నుంచి 21 వరకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమ అమలుపై జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్షణ కో-ఆర్డినేటర్లకు రాష్ట్రస్థాయిలో ఈ నెల 21న అవగాహన కల్పించారు. మం డలాల నుంచి తెలుగు-1, గణి తం-1, ఆంగ్లం-1, పరిస రాల విజ్ఞా నం-1 సబ్జెక్టు బోధించే ఉపాధ్యాయులను సబ్జెక్టుకు ఒకరి చొప్పున మొత్తం నలుగురిని ఎంపిక చేసి వారికి జిల్లాస్థాయిలో శిక్షణ ఇస్తున్నారు. ఈ కార్యక్రమం ఈ నెల 29తో ముగుస్తుంది.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 7035 మందికి..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7035 మంది రిసోర్స్ పర్సన్లకు ఆయా జిల్లా కేంద్రాల్లో శిక్షణ కార్యక్రమం ఈ నెల 29తో ముగుస్తుంది. మహబూబాబాద్ జిల్లాలో 304 ప్రాథమిక పాఠశాలలు(పీఎస్లు), 60 ప్రాథమికోన్నత పాఠశాలలు(యూపీఎస్లు) ఉన్నాయి. 980 మంది రిసోర్స్ పర్సన్లు శిక్షణ పొందుతున్నారు. హనుమకొండ జిల్లాలోని పీఎస్లు-304, యూపీఎస్లు-60లో 980 మంది, వరంగల్ జిల్లా లోని పీఎస్లు-453, యూపీఎస్లు-67లో 1637 మంది, జనగామ జిల్లాలోని పీఎస్లు-341, యూపీఎస్లు-64లో 1104 మంది, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పీఎస్లు-319, యూపీఎస్లు-43లో 849 మంది, ములుగు జిల్లాలోని పీఎస్లు-268, యూపీఎస్లు-45లో 656 మంది రిసోర్స్ పర్సన్లు శిక్షణ పొందుతున్నారు.
మండల స్థాయిలో శిక్షణ షెడ్యూల్ ఇలా..
మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుల సంఖ్య ఆధారంగా రెండు లేదా మూడు విడుతల్లో శిక్షణ కార్యక్రమం జరుగనున్నది. ఈ నెల 30 నుంచి ఆగస్టు1, 2 తేదీల్లో మొదటి విడుత, రెండో విడుత 3, 4, 6 తేదీల్లో, మూడో విడుత 8, 10, 11 తేదీల్లో నిర్వహించనున్నారు.
మూడు విడుతల్లో శిక్షణ
జిల్లాస్థాయిలో శిక్షణ పొందిన రిసోర్సు పర్సన్లు ఈ నెల 30 నుంచి మండలస్థాయిలో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు 2 లేదా 3 విడుతలో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో ఎస్జీటీలు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలకు శిక్షణ ఇస్తారు. ఆగస్టు 11 వరకు ఉపాధ్యాయులకు శిక్షణ పూర్తిచేసి 15 నుంచి అన్ని పాఠశాలల్లో తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తారు. తొలి రోజు విద్యార్థులు, తల్లిదండ్రులకు స్థానిక ప్రజా ప్రతినిధులకు ఈ కార్యక్రమ విశిష్టతను తెలియపరుస్తారు. పాఠశాల స్థాయిలో తొలిమెట్టును ప్రారంభిం చాక దీన్ని ఈ విద్యా సంవత్సరం అంతా కొనసాగిస్తారు.
అద్భుతమైన కార్యక్రమం..
తొలిమెట్టు కార్యక్రమం అద్భుతమైంది. దీని ద్వారా విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలు పెంపొందుతాయి. జిల్లా వ్యాప్తంగా 1809 మంది రిసోర్స్ పర్సన్లకు జిల్లా కేంద్రంలో శిక్షణ తీసుకుంటున్నారు. ఆగస్టు 15 నుంచి అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తారు. ఈ కార్యక్రమం విద్యార్థులకు ఎంతగానో దోహదపడుతుంది.
– అబ్దుల్ హై, డీఈవో, మహబూబాబాద్
భవిష్యత్కు పునాది
ఈ కార్యక్రమం విద్యార్థుల భవిష్యత్కు పునాదిలాంటిది. ప్రతి ఉపాధ్యాయుడు మండలస్థాయిలో ఇచ్చే శిక్షణను సద్వినియోగం చేసుకుని విద్యార్థుల్లో సామర్థ్యాలను పెంచాలి. ఐదు మండలాల్లో రేపటి నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది.
– గుగులోత్ రాము, ఎంఈవో, నెల్లికుదురు/తొర్రూరు/నర్సింహులపేట/దంతాలపల్లి