దేవరుప్పుల, జూన్ 5 : మండలంలోని సీతారాంపురం- కోలుకొండ సింగిల్ రోడ్డు డబుల్ రోడ్డుగా మారనుంది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రత్యేక చొరవతో రూ.13.87 కోట్లు మంజూరయ్యాయి. ఎంఆర్ఆర్ (మెయింటనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్) పథకంలో భాగంగా 13.8 కిలోమీటర్లు రహదారి విస్తరణకు నిధులు మంజూరవడంతో త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ఈ రహదారి 3.75 మీటర్లుండగా విస్తరణలో 5.6 మీటర్లుగా మార్చనున్నారు. ఈ రోడ్డు వెంట అత్యధిక గ్రామాలుండగా మండల కేంద్రానికి చేరడానికి దగ్గర దారిగా ఉంది. దశాబ్దాలుగా సింగల్ రోడ్డుగా ఉన్న ఈ రహదారిని డబుల్ రోడ్డుగా మార్చేందుకు నిధులు మంజూరు కావడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీతారాంపురం వద్ద జాతీయ రహదారికి కోలుకొండ వద్ద ఆర్ అండ్బీ రోడ్డు వరకు కలిసి ఉన్న ఈ రోడ్డు పూర్తయితే కొలుకొండ నుంచి సీతారాంపురం వరకున్న ఈ దారిలో పడమటి తండా, చిప్పరాళ్ల బండ తండా, చౌడూరు, రాంభోజీగూడెం, కడవెండి, మాదాపురం, పొట్టిగుట్ట తండా, దేవునిగుట తండా గ్రామపంచాయతీల ప్రజలు, రైతులు, ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉంటుంది. ఇప్పటికే రూ. 50 కోట్ల నిధులతో విస్నూరు- దేవరుప్పుల, గూడూరు- ధర్మాపురం, సింగరాజుపల్లి- జీడికల్ రోడ్లు డబుల్రోడ్లుగా మారుతున్నాయి. తాజాగా కోలుకొండ- సీతారాంపురం రోడ్డు విస్తరించనుండడంతో రవాణా సౌకర్యం మెరుగవనుంది.
మంజూరైన రోడ్లన్నీ పూర్తవుతున్నయి..
పాలకుర్తి సబ్ డివిజన్ పరధిలోని దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి మండలాల్లో విస్తరించి ఉన్న తొమ్మిది రోడ్లు డబుల్రోడ్లుగా మంజూరయ్యా యి. ఎంఆర్ఆర్ నిధులతో కోలుకొం డ- సీతారాంపురం రోడ్డు డబుల్ రోడ్డుగా మంజూరైంది. త్వరలో పనులు ప్రారంభమౌతాయి. మూడు మండలాల్లో గ్రామాల మధ్య ఉన్న అన్ని అంతర్గత రోడ్లను బీటీగా మార్చడానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు ప్రతిపాదనలు పంపాం.
-రామలింగాచారి, పీఆర్ డీఈ, పాలకుర్తి
నియోజకవర్గంలో రోడ్లు విస్తరణ, సాగునీటిపై ప్రత్యేక దృష్టి..
తాను మొదటిసారి పాలకుర్తి నియోజకవర్గంలో పోటీ చేసిన సమయంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉండగా, సాగునీటి సమస్య నెలకొంది. దీంతా ఎంతో ఆందోళన చెందా. కొన్ని రోడ్లు మెటల్, మరికొన్ని బీటీగా ఉన్నా సింగిల్ రోడ్లుగా ఉన్నాయి. పాలకుర్తి సబ్ డివిజన్ పరిధిలోని కొడకండ్ల, పాలకుర్తి, దేవరుప్పుల మండలాల్లో విస్తరించి ఉన్న అన్ని బీటీ రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చేందుకు కృషి చేశా. ఇప్పటికే పాలకుర్తి డివిజన్లో డబుల్ రోడ్డు విస్తరణ పనులు పూర్తయాయి. మరోవైపు నెల్లుట్ల- తొర్రూరు రహదారిని డబుల్రోడ్డుగా మార్చాం. సీఎం కేసీఆర్ దయతో మంత్రినయ్యా. దీంతో అభివృద్ధి పనులు చేసుకోవడానికి అవకాశం లభించింది. యశ్వంతాపూర్ వాగుపై తొమ్మిది చెక్డ్యాములు నిర్మించడంతో భూగర్భ జలాలు పెరిగాయి. ఓ వైపు రోడ్లు విస్తరణ, మరోవైపు సాగు నీటి సౌకర్యం పెరగడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. నన్ను వరసగా మూడు సార్లు గెలిపించిన పాలకుర్తి ప్రజల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. ఇంకా చేయాల్సింది ఉంది. ధర్మగడ్డ తండా నుంచి చినమడూరు వరకు బీటి రోడ్డు వేయాల్సి ఉంది.
– ఎర్రబెల్లి దయాకరావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి