మహబూబాబాద్ : జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు ఎలక్ట్రానిక్ వేయిన్ మిషన్లను వినియోగించాలని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్లపై సంబంధిత అధికారులతో కలెక్టర్ శశాంక సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనగోళ్ల వద్ద మాన్యువల్ కాంటాలను వినియోగించొద్దని సూచించారు. జిల్లాలో 2 లక్షల 14వేల 463ఎకరాల్లో వరి పంట సాగు చేసినందున ధాన్యం 2.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందన్నారు. రెవెన్యూ గ్రామాల వారీగా వరి పంట సాగును బట్టి కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయలన్నారు. జిల్లాలో 231 నుంచి 235వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి ఓ ట్యాబ్ ఇచ్చి అన్ని రకాల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందన్నారు.
అకాల వర్షాలతో దాన్యం తడిసిపోకుండా ప్రతి కొనుగోలు సెంటర్కు 30టార్ఫాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రతి సెంటర్లో 2 మాయిశ్చర్ మీటర్లు, ఎలక్ట్రానిక్ వేయిన్ మిషన్స్ ఏర్పాటు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే దాన్యాన్ని మొదట్లో రిజిస్టర్లో నమోదు చేసి రైతులకు రిసిప్టులు ఇవ్వాలని సూచించారు. రవాణలో ఎటువంటి అంతరాయలు లేకుండా చూసుకోవాలన్నారు. గన్నీ బ్యాగుల కొరత అసలు తలెత్తవద్దనివ్వదన్నారు. మిల్లర్స్ అసొసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని అదనపు కలెక్టర్కు తెలిపారు. లీగల్ మెట్రాలజీ అధికారులు వేయింగ్ బ్రిడ్జీలను చెక్ చేయాలన్నారు. దాన్యం ముందుగా పెద్దవంగర, కొత్తగూడ మండలాల్లో వస్తుందున్నందున అక్కడ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా దాన్యం కొనుగోలుపై ముద్రించిన వాల్పోస్టర్, కరపత్రాలను కలెక్టర్ శశాంక, ఎస్పీ కోటిరెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ అభిలాషా అభినవ్, కొమురయ్య, డీఆర్డీవో పీడీ. సన్యాసయ్య, పౌరసరఫరాల అధికారి నర్సింగరావు, డీఎం సివిల్ సప్లయ్ అధికారి మహేందర్, వ్యవసాయాధికారి చత్రునాయక్, మార్కెటింగ్ అధికారి వెంకట్రెడ్డి, సహకార శాఖ అధికారి ఖుర్షిద్ పాల్గొన్నారు.