మహబూబాబాద్ : తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులను గౌరవిస్తున్నట్లుగానే సమాజంలో ప్రతి ఒక్కరూ ఆడపిల్లలను గౌరవించాలని జిల్లా కలెక్టర్ కే.శశాంక పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సీడబ్ల్యూసీ చైర్పర్సన్ సుంకరనేని నాగవాణి ఆధ్వర్యంలో ఆడపిల్లలను గౌరవించాలనే గోడ పత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. నేటి పరిస్థితుల ప్రభావం వల్ల ఆడపిల్లలు అవమానాలను, సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బతుకమ్మ పండుగకు ఇస్తున్న గౌరవం మాదిరిగానే ఆడపిల్లలను సైతం సంరక్షించుకోవాలని సూచించారు.
ఆడపిల్లలను పుట్టనిద్దాం, బత్రుకనిద్దాం, ఎదగనిద్దాం, చదవనిద్దాం, మంచి భవిష్యత్తునిద్దాం, రేపటి సమాజానికి ఓ తల్లిలా, చెల్లిలా, స్నేహితురాలిగా ఆదరిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిలాషా అభినవ్, అదనపు కలెక్టర్ కొమురయ్య, ట్రైనీ కలెక్టర్ అభిషేక్ అగస్త్య, జిల్లా సంక్షేమాధికారిణి స్వర్ణలతాలెనినా, సీడబ్ల్యూసీ మెంబర్ డేవిడ్, డీసీపీవో కమలాకర్, చైల్డ్ లైన్ కో-ఆర్డినేటర్ వెంకటేశ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.