మహబూబాబాద్ : బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలకు ఊరు వెళ్తున్నారా… అయితే పోలీసులు సూచించిన జాగ్రత్తలు పాటించాల్సిందేనని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి సూచించారు. సోమవారం ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో పలు సూచనలు చేశారు. ఇంట్లోని విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదును బ్యాంక్ల్లోని లాకర్లలో భద్రపరుచుకోవాలని పేర్కొన్నారు. బ్యాంక్ల్లో లాకర్లు లేని వారు ఇంటిలోనే రహస్య ప్రాంతాల్లో దాచుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగులు సెలవుల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లేటపుడు సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సార్లను తమ ఇళ్ల వద్ద అమర్చుకోవాలని అన్నారు.
ప్రతి ఇంట్లో తలుపులకు తప్పనిసరిగా సెంట్రల్ లాకింగ్ సిస్టం ఉన్న భద్రతా తాళాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఇతర గ్రామాలకు వెళ్తే సంబంధిత పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించాలన్నారు. దీని వల్ల పోలీసులు గస్తీ, పెట్రోలింగ్ చేసే సమయంలో సదరు ఇళ్లపై నిఘా వేసి ఉంచుతారని చెప్పారు. కాలనీలు, గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరించినట్లయితే వెంటనే 100 డయల్కు సమాచారం అందించాలన్నారు. వాహనాలను తమ ఇళ్ల ఆవరణల్లోనే పార్కింగ్ చేసుకోవాలని సూచించారు. మహిళలు బంగారు ఆభరణాలు ధరించి వేడుకలకు, పండుగలకు హాజరయ్యేటపుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.