పోచమ్మమైదాన్, ఆగస్టు 24: మగ్గంపై ఉచిత శిక్షణ పేద మహిళలకు స్వయంఉపాధి అవకాశాలు చూపి వారి జీవితాల్లో వెలుగునింపనున్నది. వరంగల్ దేశాయిపేటలో చేనేత మాదిరిగా చిన్న మగ్గం(ఫ్రేమ్)పై ఆధునిక డిజైన్లలో అందిస్తున్న తర్ఫీదు మహిళలకు ఎంతో ఉపయోగపడనున్నది. పేద మహిళలు నేర్చుకున్న ఈ కళ ద్వారా వారి నైపుణ్యం బయటపడి, సమాజంలో గుర్తింపు దక్కనున్నది. ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ ద్వారా స్వర్ణభారతి యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యాన దేశాయిపేటలోని స్లమ్ ఏరియాలో మగ్గంపై శిక్షణకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా పేద, మధ్య తరగతి మహిళలను రెండు బ్యాచ్లుగా విభజించారు. ఒక్కో బ్యాచ్లో 25మంది చొప్పున 50మందికి శిక్షణ ఇవ్వనున్నారు.
45రోజుల పాటు ఆదివారం మినహా ప్రతిరోజు తర్ఫీదు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మొదటి బ్యాచ్లోని 25మందికి శిక్షణ ప్రారంభించారు. రెండవ బ్యాచ్లో 25మందికి శిక్షణను బుధవారం ప్రారంభించారు. ఇక్కడ మెళకువలు నేర్చుకుంటున్న మహిళలకు ఉచితంగా మగ్గం డిజైన్లకు అవసరమైన మెటీరియల్ మొత్తం అందజేశారు.18 నుంచి 60 సంవత్సరాల లోపు వారికి ఈ అవకాశం కల్పించారు. ఈ శిక్షణలో మహిళల స్వయం సమృద్ధి సాధించేందుకు 510 రకాల డిజైన్లపై తర్ఫీదు ఇస్తున్నారు. ముఖ్యంగా మహిళలు ధరించే చీరెలు, జాకెట్లపై వేసే అందమైన డిజైన్లను ఫ్రేమ్ మగ్గంపై నేర్చుకుంటున్నారు. ఈ మగ్గంపైనే చీరెలు, జాకెట్లపై మెరుపు, చెముకీలు అద్దనున్నారు. దీంతో వీరి కళాత్మకైమైన నైపుణ్యం ద్వారా వస్ర్తాలపై ఆధునికత ఉట్టిపడేలా మలుచుతూ మహిళలు తమ ప్రతిభ నిరూపిస్తున్నారు. ఒక్కో బ్యాచ్కు గుజరాత్, రాజస్థాన్ నుంచి వచ్చిన ఒక మాస్టర్ ద్వారా ట్రెయినింగ్ ఇస్తున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత వీరి పేర్లను హస్తకళలు, మెప్మా డిపార్లమెంట్లలో నమోదు చేయనున్నారు. కాగా వీరికి ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థతో పాటు స్వర్ణభారతి యూత్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు తగిన సహాయ, సహకారాలు అందిస్తున్నారు.