Kakatiya Thoranam | ఖిలావరంగల్, మే 16 : కాకతీయుల అద్భుత శిల్ప కళావైభవానికి.. నాటి సాంకేతిక నైపుణ్యానికి నిలువెత్తు సాక్ష్యాలు కీర్తితోరణాలు. అంతటి ప్రాశస్త్యం కలిగిన కీర్తితోరణాలు, శిల్పుల నైపుణ్యం, వారి ప్రతిభ, కళాత్మకత చూపరులను మంత్రముగ్దులను చేస్తోంది. ఎంతో ఘనకీర్తి కలిగిన కీర్తితోరణాల వాకిట్లో పొక్కిలి చేశారు. కాపాడాల్సిన కేంద్ర పురావస్తు శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
జేసీబీతో తవ్వకాలు
అభివృద్ధి పేరుతో కేంద్ర పురావస్తు శాఖ నిబంధనలను తుంగలో తొక్కుతున్నదనే ఆరోపణలున్నాయి. కోటలోని కీర్తితోరణాల నడుమ వర్షం నీరు నిల్వకుండా పైపులైన్ ద్వారా బయటకు తరలించేందుకు కేంద్ర పురావస్తు శాఖ అధికారులు పనులు చేపట్టారు. ఇది మంచికే అయినా పని చేసే తీరు సరిగా లేదని చరిత్రకారులు, పర్యాటకులు ఆగ్రహిస్తున్నారు. చారిత్రక కట్టడాల మధ్య తవ్వకాలు కాని, మరే ఇతర పనులు చేపట్టాలన్నా మనుషులతోనే చేయించాల్సి ఉంటుంది. కానీ, ఉత్తర కీర్తితోరణం ముందు జేసీబీతో ఒక పెద్ద గొయ్యి తీశారు. అలాగే, కీర్తితోరణం ఉత్తరం వైపు పైపులు వేసేందుకు ప్రొక్లెయినర్తోనే పనులు చేపట్టారని స్థానికులు తెలిపారు. ఈ తవ్వకాల్లో భూమిపై నుంచి రెండున్నర అడుగుల కింద సుమారు 50 మీటర్ల పొడవు డంగు సున్నంతో నిర్మించిన స్లాబ్ నిర్మాణం కనిపిస్తోంది. దాని కింద సన్నని ఇసుక, రాళ్లతో పునాది కనిపిస్తున్నాయి.
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పర్యాటకులు
నిబంధనలు ఉల్లంఘించి కోటలో తవ్వకాలు చేపట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే తవ్వి వదిలేయడంతో పర్యాటకులు అటుగా వెళ్లకుండా వెనుదిరుగుతున్నారు. సుమారు ఐదు అడుగుల లోతు మూడు అడుగుల వెడల్పుతో 50 మీటర్ల పొడవు తవ్వి వదిలేశారు. పైగా భద్రతాపరమైన చర్యలు కూడా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఇటీవల కోటలోని చారిత్రక ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి పనుల్లో యంత్రాలను వాడినట్లు స్థానికులు ఆరోపించారు. కాంట్రాక్టర్కు లాభం చేకూర్చే దిశగా కాకుండా కేంద్ర పురావస్తు శాఖ అధికారులు నిబంధనల మేరకు అభివృద్ధి పనులు చేపట్టాలని పర్యాటకులు కోరుతున్నారు.