వరంగల్, అక్టోబర్ 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్లో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై గలమెత్తిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. వెనుకబడిన వర్గాలకు గుర్తింపు ఇచ్చే బీఆర్ఎస్లో చేరేందుకు అంగీకరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా వెళ్లి హైదరాబాద్లోని పొన్నాల నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలు అనుసరిస్తున్న బీసీల వ్యతిరేక వైఖరిని, ఈ వర్గాలకు ప్రాధాన్యం ఇస్తున్న బీఆర్ఎస్ విధానాలపై చర్చించారు.
అనంతరం పొన్నాల బీసీ వర్గాలకు ప్రాధాన్యమిచ్చే బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. రెండు రోజుల్లో బీఆర్ఎస్లో చేరుతారని తెలిసింది. సోమవారం చేరిక కార్యక్రమం ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్పై పొన్నాల తిరుగుబాటు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఏర్పాటు నుంచి కాంగ్రెస్లో బీసీలను అణగదొక్కుతున్న తీరును ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న తనను కాంగ్రెస్ అధిష్టానం అకారణంగా తొలగించిందని, అప్పటి కంటే 2018లో దారుణమైన ఫలితాలు వచ్చినా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్కుమార్రెడ్డిపై చర్యలు తీసుకోకపోగా, అదనంగా పదవులు ఇచ్చారని అంటున్నారు.
మాజీ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న పొన్నాలపై పీసీసీ నాయకత్వమే రాజకీయంగా కుట్రలు చేస్తుండడంపై మొదటి నుంచి కాంగ్రెస్లో ఉంటున్న వారు తప్పుబడుతున్నారు. ప్రస్తుత నాయకత్వం హయాంలో కాంగ్రెస్ పూర్తిగా మారిపోయిందని, ఇతర పార్టీల పెత్తనం పెరిగిందని చెబుతున్నారు. అసలైన కాంగ్రెస్ నేతలకు అవమానాలు ఎదురవుతున్నాయని, బయటి నుంచి వచ్చిన వారికి అవకాశాలు ఇస్తున్నారని అంటున్నారు.
ఉమ్మడి జిల్లాలో కీలకమైన బీసీ నేతగా పొన్నాలకు గుర్తింపు ఉన్నది. 1989, 1999, 2004, 2009 ఎన్నికల్లో ఆయన జనగామ నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 1985, 1994, 2014, 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. నలభై ఏండ్లు కాంగ్రెస్లో కీలకంగా పని చేసిన పొన్నాల పీసీసీ అధ్యక్షుడిగానూ పని చేశారు.
బీసీల్లో బలమైన నేతగా ఉన్న తన విషయంలో కాంగ్రెస్ ప్రస్తుత నాయకత్వం వ్యవహరించిన తీరుపై పొన్నాల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇన్నాళ్లు భరిస్తూ వచ్చిన లక్ష్మయ్య శుక్రవారం తిరుగుబాటు చేశారు. బీసీలకు కాంగ్రెస్ చేస్తున్న అన్యాయాలను వివరించారు. సుదీర్ఘకాలం అనుబంధం ఉన్న కాంగ్రెస్కు రాజీనామా చేశారు. పొన్నాల రాజీనామాతో బీసీ వర్గాలకు కాంగ్రెస్ చేస్తున్న అన్యాయంపై ఉమ్మడి వరంగల్ జిల్లాలో, రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైంది. పొన్నాల నిర్ణయంతో బీసీ వర్గాలు కాంగ్రెస్కు పూర్తిగా దూరమయ్యే పరిస్థితి వచ్చింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలు గులాబీ పార్టీనే ఆదరిస్తున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కు ఘనవిజయం చేకూరుస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ మరింత బలహీనపడి ఎన్నికల్లో పదిలోపు సీట్లకు తగ్గిపోయిన పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ నాయకత్వం తీరుతో కాంగ్రెస్ సీనియర్ నేతలు, పేద వర్గాలు ఆ పార్టీకి దూరమవుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేతలు చాలా మంది బీఆర్ఎస్లో చేరారు. ప్రజలు ఉన్న వైపే తాము ఉండాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, జిల్లా, మండల స్థాయి ప్రజాప్రతినిధులు వందల మంది చేరారు. ఇంకా చేరుతూనే ఉన్నారు.