హనుమకొండ, మే 06 : బీఆర్ఎస్ 25 ఏళ్ల రజతోత్సవ సభను విజయవంతం చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా బృందాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అభినందించారు. మంగళవారం తెలంగాణ భవన్లో వరంగల్ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయిన కేటీఆర్ వరంగల్ సభ సక్సెస్ ఇతర అంశాలను, అనుభూతులను పంచుకున్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర నుంచి భారత రాష్ర్ట సమితి 25 ఏళ్ల ఉత్సవం వరకు వరంగల్ కేంద్రంగా ఏ సభ నిర్వహించినా చరిత్రకి ఎక్కిందని, ఇది కూడా ఆ తరహాలోనే చరిత్రలోకి ఈ సభ ఎక్కబోతుందని కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమ ఉనికి, భావజాల వ్యాప్తి, పార్టీ నిర్వహించిన బహిరంగ సభలన్నీ వరంగల్ సభలతో పోల్చుకునేలా జన సమీకరణ చేశారని, లక్షలాది పార్టీ కార్యకర్తలకు సకల సౌకర్యాలు కల్పించారని చెప్పారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మెదక్ నేతలను సమన్వయం పరుస్తూ సభ విజయవంతానికి కృషి చేశారని, నిర్వహణలో పొరపాట్లు లేకుండా ముందుకు సాగరని కేటీఆర్ అభినందించారు. కేటీఆర్ను కలిసిన వారిలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ కే వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.