కమలాపూర్, జనవరి 31 : కమలాపూర్ ఎంజేపీ బాలికల స్కూల్ భవనం ప్రారంభం అనంతరం అక్కడి విద్యార్థులతో మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా మాట్లాడారు. పీజీటీ బయోసైన్స్ టీచర్ ఎన్.రజిత డిజిటల్ క్లాసులు బోధిస్తుండగా కేటీఆర్ విద్యార్థులతో కలిసి కూర్చొని పాఠాలు విన్నారు. అనంతరం ముగ్గురు విద్యార్థులతో మాట్లాడారు.
కేటీఆర్ : ఏం పేరు చిన్నా?
వంశిక : తవుటం వంశిక సర్
కేటీఆర్ : ఏం చదువుతున్నవ్?
వంశిక : సిక్త్స్ క్లాస్ సర్
కేటీఆర్ : మీ కుటుంబ సభ్యులు ఎందరు?
వంశిక : ముగ్గురు సార్
కేటీఆర్ : మీ అమ్మనాన్న ఏం చేస్తరు?
వంశిక : నాన్న మేస్త్రీ, అమ్మ పేపరు ప్లేట్ కంపెనీల పనికి పోతది సర్
కేటీఆర్ : హాస్టల్లో పుడ్ బాగుంటుందా?
వంశిక : బాగుంటుంది సర్
కేటీఆర్ : ఈ రోజు పొద్దున ఏం ఫుడ్ పెట్టిండ్లు?
వంశిక : పులిహోర సర్
కేటీఆర్ : ఎగ్స్ పెడుతున్నరా?
వంశిక : పెడుతున్నరు సర్
కేటీఆర్ : చికెన్ ఏ రోజు పెడుతున్నరు?
వంశిక : బుధవారం పెడుతున్నరు సర్
కేటీఆర్ : నీ యాంబిషన్ ఏంటి ?
వంశిక : ఇంజనీర్ అవుత సార్
కేటీఆర్ : ఏం క్లాస్ చదువుతున్నవ్?
ప్రవళిక : టెన్త్ క్లాస్ సర్
కేటీఆర్ : మెనూ బాగుంటున్నదా?
ప్రవళిక : బాగుంటున్నది సార్
కేటీఆర్ : మీకు అగ్రికల్చర్ (వ్యవసాయ భూమి) ఉందా?
ప్రవళిక : ఉంది సర్
కేటీఆర్ : ఎంత ఉంది?
ప్రవళిక : ఎకరంన్నర సర్
కేటీఆర్ : రైతుబంధు స్కీం తెలుసా?
ప్రవళిక : రెండేళ్ల నుంచి తెలుసు సర్. మా ఫాదర్కు, మా గ్రాండ్ ఫాదర్కు డబ్బులు వస్తున్నయ్ సర్
కేటీఆర్ : ఓకే, బాగా చదువుకోండి..
ప్రవళిక : థాంక్యూ సార్
కేటీఆర్ : ఏ క్లాస్ చదువుతున్నవ్?
హరిణి : సిక్త్స్ క్లాస్ సర్
కేటీఆర్ : మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా?
హరిణి : పెడుతున్నార్ సార్
కేటీఆర్ : డిజిటల్ క్లాసులు చెప్తున్నరా? ఓల్డ్ స్కూళ్ల ఉన్నయా?
హరిణి : చెప్పుతున్నరు సర్, పాతస్కూళ్లో ఉన్నయ్ సర్
కేటీఆర్ : బోర్డుపై చెప్పేటివి అర్థమైతున్నయా?
హరిణి : అర్థమైతున్నయి సర్
కేటీఆర్ : అర్థం కాకుంటే ఫోన్లో చూసుకోవడానికి ఇంటి వద్ద అవలబుల్ ఉన్నాయా?
హరిణి : ఉన్నయ్ సార్
కేటీఆర్ : బెస్ట్ఆఫ్ లక్. బాగా చదువుకోవాలి.
.. అంటూ మంత్రి కేటీఆర్ అక్కడి నుంచి బయటకు వచ్చి స్కూల్ ఆవరణలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వారితో కూర్చుంటూ..‘సారీ అమ్మా లేట్ అయింది ఏమనుకోవద్దు’ అని కోరారు. ఎనిమిదో తరగతి విద్యార్థినులు హర్షిత, అర్చనతో కలిసి మాట్లాడుకుంటూ భోజనం చేశారు. విద్యార్థులతో పాటు మంత్రి కేటీఆర్కు చికెన్ వడ్డిస్తుండగా ‘వద్దు వద్దు నేను నాన్ వెజ్ తినను’ అని చెప్పి, పప్పు సాంబార్తో భోజనం చేశారు.