భీమదేవరపల్లి, జనవరి 9 : భక్తుల కొంగుబంగారం కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మకర సంక్రాంతిని పురస్కరించుకుని ఈ నెల 10న స్వామివారి కల్యాణంతో ప్రారంభమయ్యే జాతర ఈ నెల 18న స్వామివారి గ్రామ పర్యటనతో ముగుస్తుంది. ఇప్పటికే స్వామివారి కల్యాణ మహోత్సవ వేదిక అందంగా ముస్తాబైంది. జాతరకు తెలంగాణ పలు జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. కోరిన కోర్కెలు తీర్చాలని స్వామి వారికి కోరమీసాలు సమర్పిస్తారు. జాతరలో భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు కల్పిస్తున్నట్లు ఈవో కిషన్రావు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు కాజీపేట ఏసీపీ డేవిడ్రాజు తెలిపారు. కాగా జాతర ప్రారంభోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొననున్నారు.
కాకతీయ రుద్రేశ్వరుని కాలంలో మల్లికార్జున పండితుని మనుమడు కేదారి పండితునిచే వీరభద్రస్వామి ఆలయం శైవాగమానుసారం ప్రతిష్టింపబడినట్లు స్థలపురాణం చెబుతున్నది. క్రీ.శ.1600 సంవత్సర ప్రాంతంలో కొంతమంది కుమ్మరులు కొండపైకి ఎడ్లబండ్లు కట్టుకుని వెళ్లారు. అక్కడ వారికి అవసరమయ్యే కర్రలు కొట్టుకుని ఎడ్లబండ్లలో వేసేందుకు చూడగా ఎద్దులు, బండి కనిపించలేదు. వారు కొండచుట్టూ కలియతిరిగి అలసిపోవడంతో ఆ రాత్రి కొండపైనే నిద్రించారు. వీరభద్రస్వామివారు కలలో వారికి కనిపించి నన్ను ఈ కొండపై నుంచి దింపి కింద ఉన్న ఆలయంలో ప్రతిష్ఠింపమని వారిని ఆజ్ఞాపించారు. దీంతో కేదారి పండితునిచే స్వామివారిని కిందకు దింపి ఆలయంలో ప్రతిష్ఠించారు.
ఈ నెల 10న సాయంత్రం వీరభద్రస్వామి వారి కల్యాణం, 14న భోగి పండుగ, 15న సంక్రాంతి పర్వదినాన బండ్లు తిరుగుట, 16న నాగవెల్లి, పుష్పయాగం, 17న త్రిశూల స్నానం, 18 తెల్లవారుజామున అగ్నిగుండాలు, అదేరోజున సాయంత్రం స్వామివారి గ్రామ పర్యటనతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా స్వామివారి ఆలయంలో దేవతావృక్షాలు రుద్రాక్ష, జమ్మి, మర్రి, వేప, జుబ్బి, రావి, ఉసిరి ఉన్నాయి. ఫిబ్రవరి, మార్చి నెలలో రాలిపడే రుద్రాక్షల కోసం భక్తులు వేయి కళ్లతో ఎదురుచూస్తారు. బ్రహ్మోత్సవాల్లో రుద్రాక్ష చెట్టును భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జాతరకు స్పెషల్ బస్సులు నడిపిస్తున్నది. వరంగల్-1 డిపో నుంచే కాకుండా హుజూరాబాద్, హుస్నాబాద్ డిపోల నుంచి నేరుగా కొత్తకొండకు స్పెషల్ బస్సులు నిరంతరం నడుస్తాయి.
బ్రహ్మోత్సవాల్లో అడుగడుగునా సీసీకెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా జాతర ప్రాంగణంలో నలువైపులా రూట్మ్యాప్ ఫ్లెక్సీల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎవరైనా బ్రహ్మోత్సవాల్లో దారి తప్పితే రూట్మ్యాప్ ఆధారంగా గమ్యం చేరుకునేలా సదుపాయం కల్పిస్తున్నారు.
జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కాజీపేట ఏసీపీ డేవిడ్రాజు ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో 600మంది వరకు పోలీసులు విధులు నిర్వర్తిస్తారని ఆయన తెలిపారు. అడుగడుగునా పోలీసులు పహారా, గస్తీ నిర్వహించనున్నారు.
ఉత్సవాల్లో భక్తుల కోసం అన్ని సదుపాయాలు కల్పించాం. తాగునీటితో పాటు స్నానాల గదులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశాం. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. వృద్ధుల కోసం వాహనాలు సమకూర్చుతాం. భక్తుల సౌకర్యార్థం పూర్తి వసతులు కల్పిస్తు న్నాం. వైద్యశిబిరం, అగ్నిమాపక యంత్రాలు అందుబాటులో ఉన్నాయి.
నేటి సాయంత్రం జరిగే వీరభద్రస్వామి కల్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. స్వామివారి కల్యాణ మండపంలో ఈ మహోత్సవం వైభవంగా జరుగనుంది. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి కల్యాణ మహోత్సవాన్ని తిలకించాలని ఆలయ ముఖ్య అర్చకులు మొగిలిపాలెం రాంబాబు కోరారు.